IT Returns | గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు దగ్గర పడుతున్నది. ఈ నెలాఖరులోగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్స్ సమర్పించాలి. ఐటీ రిటర్న్స్ దాఖలులో తప్పొప్పుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, చివరి క్షణంలో ఐటీ రిటర్న్స్ సమర్పిస్తే తప్పొప్పులను చెక్ చేసుకోవడం చాలా కష్టం. కనుక, పూర్తిగా గడువు సమీపించకముందే ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముందే ఐటీ రిటర్న్స్ సమర్పించినా.. తప్పొప్పులను సవరించుకుని సవరణ ఫామ్ సబ్మిట్ చేయడానికి వీలవుతుంది. ఐటీ రిటర్న్స్లో తప్పొప్పులను సవరించడానికి ఐటీ చట్టంలోని 26 ఏఎస్ ఫామ్ సబ్మిట్ చేయాలి. అలా కాకుండా చివరిక్షణంలో ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేస్తే.. సవరణలకు సమర్పించే 26ఏఎస్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. గడువు దాటిన తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
సవరణలతో కూడిన ఫామ్ 26ఏఎస్ను కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ అంటారు. నిర్దిష్ట పరిమితిని మించి లావాదేవీలు జరిపినప్పుడు ఆయా సంస్థలు ఈ సమాచారాన్ని ఆదాయం పన్ను విభాగాన్ని తెలియజేస్తాయి. ఈ సమాచారం మొత్తాన్ని ఆదాయం పన్ను విభాగం ఫామ్ 26ఏఎస్లో నింపుతుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు తమ కస్టమర్లు పరిమితి మించి జరిపిన లావాదేవీల వివరాలను ఐటీ విభాగానికి తెలియజేస్తాయి.
ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడంలో తప్పొప్పులను గుర్తించడానికి ఉపయోగించేదే ఫామ్ 26ఏఎస్. మూడు నెలలకోసారి 26ఏఎస్ ఫామ్లో డేటా అప్డేట్ చేస్తుంటాయి. దీన్ని మీరు ఆదాయం పన్ను విభాగం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఐటీ రిటర్న్స్ ఫామ్లో మీరు నింపిన డేటా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, బ్రోకింగ్ సంస్థలు కూడా పొరపాటు చేయొచ్చు. ఆ పొరపాట్లను సరి చేయాలని ఆయా సంస్థల్ని కోరొచ్చు. అన్ని అంశాలు చెక్ చేసుకుని సకాలంలో ఐటీ రిటర్న్న్ సబ్మిట్ చేయడం మర్చిపోవద్దు. సకాలంలో ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం వల్ల రీ ఫండ్స్ కూడా ముందే వస్తాయి.