ITR Filing | ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి సోమవారం తుది గడువు కావడంతో వ్యక్తిగత ఆదాయం పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ ఫైలింగ్ కోసం పోటీ పడుతున్నారు. భారీ సంఖ్యలో రిటర్న్స్ దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం 6.46 గంటలకు 6.50 కోట్ల పై చిలుకు వేతన జీవులు ఐటీఆర్ దాఖలు చేశారు. సోమవారం ఒక్కరోజూ.. సాయంత్రం ఆరు గంటల వరకు సుమారు 36.91 లక్షల ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి. 1.78 కోట్లకు పైగా ఖాతాలు లాగిన్ అయ్యాయని ఐటీ విభాగం తెలిపింది.
ఆదివారం వరకు 6.13 కోట్ల ఐటీఆర్లు ఫైల్ అయ్యాయి. ఈ నెల 31 సాయంత్రం నాలుగు గంటల వరకు 26.74 లక్షల ఐటీఆర్ లు దాఖలు కాగా, సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే చివరి గంటలో 3.84 లక్షల మంది ఐటీఆర్లు ఫైల్ చేశారు.
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో పోటెత్తిన వరదలతో జన జీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల వరదల భీభత్సం నుంచి బయట పడలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ఐటీఆర్ దాఖలు గడువును పొడిగిస్తుందని పలువురు చార్టర్డ్ అకౌంటెంట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని వారాలుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే విషయమై వేతన జీవుల్లో ఐటీ విభాగం పలు రకాల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.