కండ్లకోయలో 10.11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
రేపే ఐటీ మంత్రి కేటీఆర్ చేతులమీదుగా శంకుస్థాపన
మేడ్చల్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నలువైపులా అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఈ క్రమంలోనే ఉత్తర దిశగా ఐటీ విస్తరణలో భాగంగా మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఐటీ టవర్స్ శంకుస్థాపన (భూమి పూజ)కు సర్వం సిద్ధమైంది. గురువారం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ గేట్వే ఐటీ పార్క్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వెంటనే టీఎస్ఐఐసీ పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నది. 10.11 ఎకరాల్లో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 అంతస్తులతో రెండు ఐటీ టవర్లను రూ.250 కోట్ల నిధులతో నిర్మించనున్నారు.
150 కంపెనీలు..
గేట్వే ఐటీ పార్క్లో 150 కంపెనీలు వచ్చేలా ఐటీ టవర్స్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే 82 సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు టీఎస్ఐఐసీ అధికారులు తెలిపారు. మరికొన్ని సంస్థల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు వస్తున్నాయన్నారు. కాగా, ఇక్కడి సంస్థలతో సుమారు 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. పరోక్షంగా కూడా వేలాది మందికి ఉపాధి లభించనున్నది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల యువతకు ఐటీ పార్క్ కలిసిరానున్నది.
కేటీఆర్ చొరవతోనే..
మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఐటీ పార్క్ ఏర్పాటుకు కృషి చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మేడ్చల్ జిల్లా అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లగలదన్నారు.