హైదరాబాద్, జూలై 25: ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,250 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగి రూ.1,686.50 కోట్లకు ఎగబాకింది. జనవరి-మార్చి మధ్యకాలంలో నమోదైన రూ.1,751.40 కోట్ల కంటే ఇది తగ్గడం విశేషం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఆదాయ వృద్ధి 15-20 శాతం మధ్యలో ఉండనున్నట్లు సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్, ఎండీ కృష్ణ బొడనపు తెలిపారు. గత త్రైమాసికంలో 48.8 మిలియన్ డాలర్ల విలువైన ఆరు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. కంపెనీ షేరు ధర 1.16 శాతం తగ్గి రూ.1,466.45 వద్ద ముగిసింది.