Financial Planning | కొత్త ఏడాది.. కొంగ్రొత్త ఆలోచనలు.. లక్ష్యాలు.. ఆకాంక్షలు ప్రకటించుకుంటారు ప్రతి ఒక్కరు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని నిర్ణయించుకుంటారు.. అందుకు అనుగుణంగా మార్నింగ్ వాక్ మొదలు పెడతారు. వ్యాయామం చేస్తారు. కానీ, భవిష్యత్ అవసరాలకు కీలకమైన ఆర్థిక రంగంపై మాత్రం ఫోకస్ చేయరు. ఎవరైనా సరే.. ఇతర అంశాల్లో ఎలా ఉన్నా.. ఆర్థికాంశాల్లో నిత్యం అలర్ట్గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక పరమైన విషయాల్లో మనం చేసే పొరపాట్లు మనపై ఆధారపడి జీవించే వారిని సైతం ప్రభావితుల్ని చేస్తాయని పరిగణనలోకి తీసుకోవాలి. కనుక పాత ఏడాదిలో చేసిన పొరపాట్లను, తప్పులను గుర్తించి.. కొత్త సంవత్సరంలో ఆర్థికపరంగా జాగ్రత్తలు తీసుకోవడం శుభసూచకం అని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
కొత్తగా కొలువు సంపాదించుకున్న వారు.. ఇప్పటికే కొన్నేండ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్నవారు పొరపాట్లు చేస్తారు. పొదుపు అంటే పలువురు పన్ను ప్రయోజనాల కోసమే అన్నట్లు వ్యవహరిస్తారు. కొందరు ఎక్కువ రిటర్న్స్ ఆశించి పెట్టుబడులు మదుపు చేస్తుంటారు. ఆర్థిక అంశాలపై అవగాహన కలవారైతే ఇటువంటి పొరపాట్లు చేయరు. ఇన్కం టాక్స్ రాయితీ కోసం బీమా, ఇతర పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదే అయినా.. వాటికి ఒక లక్ష్యం ఉంటే లబ్ధి చేకూరుతుంది. లక్ష్యాన్ని చేరుకుంటే సంతృప్తి పొందుతారు. కనుక కొత్త సంవత్సరం ఆరంభంలోనే లక్ష్యాలను నిర్దేశించుకుంటే మంచిది. అయితే, సాధించగలిగే లక్ష్యాలు ఖరారు చేసుకుంటే బాగుంటుంది.
గతంతో పోలిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల యువతరానికి అవగాహన పెరిగింది.. అయినా పలువురు జీవిత బీమా కోసం చేస్తున్న ఖర్చు మొత్తం తిరిగి రావాలని కోరుకుంటున్నారు. వాస్తవంగా ప్రతి ఒక్కరూ తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవడం సరైన నిర్ణయం అంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్కరూ తమ వయస్సు, ఆదాయం, కెరీర్, కుటుంబ సభ్యుల అవసరాలకు తగినట్లు ఈ టర్మ్ బీమా పాలసీ ఎంచుకోవాలి. తక్కువ ప్రీమియం కోసం తక్కువ మొత్తం పాలసీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. కుటుంబ అవసరాలు, మన స్థోమత ఆధారంగా టర్మ్ పాలసీ తీసుకోవడం బెటర్గా ఉంటుంది.
నెలవారీగా ఐదంకెల వేతనం.. ఏడాది తర్వాత ఇంక్రిమెంట్.. ఉద్యోగం మారితే.. భారీగా వేతనం పెరుగుతుందని యువత లెక్కలేస్తుంటారు. వచ్చే ఏడాది పెరిగే వేతనంపై ఊహాగానాలు చేస్తారు. వేతనం పెరిగాక పొదుపు చేద్దాం అన్న ఆలోచనలు వస్తాయి. కానీ, కొవిడ్-19 పరిస్థితులు, తాజాగా ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాల్లో కోతలు చూశాకైనా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు, వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు అందుకుంటున్న వేతనంలో 50 శాతం ఇంటి అద్దె ప్లస్ కిరాణా బిల్లు, ఇతర బిల్లులకు కేటాయిస్తే బాగుంటుంది. 30 శాతం వేతనం కుటుంబ సభ్యుల కోరికలు, సరదాలు తీర్చుకో్వడానికి ఉపయోగించొచ్చు. మరో 20 శాతం పొదుపు చేయాల్సిందేనని నికరంగా నిర్ణయించుకోవాలి.
ఎల్లవేళలా పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒక్కోసారి విపత్కర పరిస్థితుల్లో అవసరాలు తలెత్తుతాయి. కరోనా వేళ.. తాజాగా మాంద్యం పేరిట బడా సంస్థల నుంచి సాధారణ సంస్థల వరకు భారీగా ఉద్యోగుల ఉద్వాసన జరిగింది. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు రోజువారీ జీవితంలో ఇబ్బందులు తలెత్తకుండా ఆరు నెలల పాటు కుటుంబం సాగిపోయేలా ఎమర్జెన్సీ నిధి అందుబాటులో ఉంచుకోవాలి.
ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. వాటిల్లో తీరనివీ ఉంటాయి. ఏదైనా కొలువులో చేరగానే ఆ కోరికలు తీర్చేసుకుంటారు. కలలు తీర్చుకోవడం మంచిదే కావచ్చు కానీ.. అది విలాసాలకు బాటలు వేయొద్దని సూచిస్తున్నారు. నెలవారీగా ఈఎంఐలు కట్టగల సామర్థ్యం ఉందని విలాసాల్లో మునిగితేలితే అప్పుల్లో కూరుకుపోయే ముప్పు పొంచి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరిమిత ఖర్చులు మంచిదని చెబుతున్నారు.
గతంతో పోలిస్తే ఇప్పుడు తేలిగ్గా క్రెడిట్ కార్డు పొందొచ్చు. ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కొందరికి క్రెడిట్ లిమిట్ రూ.లక్షల్లో ఉంటది. ఇది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. అవసరాన్ని బట్టి యూజ్ చేస్తే క్రెడిట్ కార్డు మనకు అండగా నిలుస్తుంది. అలా కాకుండా ఆఫర్ల మోజులో పడ్డా.. క్యాష్ బ్యాక్ క్రేజీలో చిక్కుకున్నా.. తర్వాత తడిసిమోపెడవుతుంది. రుణాల ఊబిలో చిక్కుకుంటారు. క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులకు రుణాలు చేయాల్సి వస్తే వాటి నుంచి బయటకు రావడం అంత తేలికేం కాదు. ఈ కంట్రోల్ లేకపోవడం వల్లే పలువురు తమ క్రెడిట్ కార్డులు రద్దు చేసుకుంటున్నారు. కనుక క్రెడిట్ కార్డు వాడకంలో ఆచితూచి ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు.