బెంగళూరు, నవంబర్ 17: సమీప భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ 2 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన క్రిష్ గోపాలకృష్ణన్ చెప్పారు. ఇక్కడ జరిగిన టెక్ సదస్సులో మాట్లాడుతూ.. నిజానికి ఇప్పుడు భారతీయ ఐటీ పరిశ్రమ ఉద్యోగుల వలసలు, మూన్లైటింగ్, వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులు ఆఫీసులకు ఎప్పటికల్లా రాగలరు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నదన్నారు. అయినప్పటికీ ఐటీ కంపెనీలు తిరిగి వృద్ధిపథంలో దూసుకుపోగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే త్వరలో 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్న విశ్వాసాన్ని కనబర్చారు.
కరోనా సమయంలో డిజిటైజేషన్ పెరిగిందని ఈ సందర్భంగా గోపాలకృష్ణన్ తెలిపారు. రాబోయే మరికొన్నేండ్లూ డిజిటైజేషన్ హవా ఉంటుందన్నారు. దీంతో టెక్నాలజీల్లోకి పెట్టుబడులు ఆకర్షణీయ స్థాయిలో రాగలవని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఐటీ ఇండస్ట్రీలో కనీసం 2 లక్షల ఉద్యోగావకాశాలైనా ఏర్పడగలవని అంచనా వేశారు. అలాగే భారతీయ ఐటీ సేవల సంస్థలు, దేశంలోని గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్లు ఎటువంటి విపత్కర పరిణామాలనైనా తట్టుకుని నిలబడగలవని గత రెండేండ్లలో నిరూపించాయని చెప్పారు. అందుకే దేశీయ ఐటీ సేవల్లోని బహుళజాతి సంస్థలు, విదేశీ కంపెనీలపై విశ్వాసం పెరిగిందని వెల్లడించారు. నిజానికి పరిశ్రమలో ఒడిదుడుకులు సహజమేనని, అది స్వల్పకాలిక పరిణామంగానే భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే గడిచిన 25 ఏండ్ల కంటే వచ్చే 25 ఏండ్లు ఐటీ పరిశ్రమ మరింత రాణించగలదన్న విశ్వాసాన్ని గోపాలకృష్ణన్ వెలిబుచ్చారు.
ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి (క్యూ2)గాను 65 శాతం వేరియబుల్ పేను అందుకోనున్నారు. అర్హులైన ఉద్యోగులంతా నవంబర్కు సంబంధించిన జీతాల్లో దీన్ని పొందనున్నట్టు సంస్థ ఇచ్చిన ఓ ఇంటర్నల్ మెయిల్ ద్వారా తెలుస్తున్నది. కాగా, వ్యక్తిగత పనితీరు, క్యూ2లో వారి సేవల ప్రకారం వచ్చే మొత్తాల్లో తేడాలుంటాయని కూడా కంపెనీ తెలియజేసినట్టు సమాచారం. అమెరికా, కెనడాల్లోని ఉద్యోగులకూ ఈ వేరియబుల్ పే రానున్నది. ఇదిలావుంటే ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ1)లో ఇచ్చిన వేరియబుల్ పే కంటే జూలై-సెప్టెంబర్లో ఇవ్వబోతున్నది తక్కువగా ఉన్నది. క్యూ1లో 70 శాతం వేరియబుల్ పే ఇచ్చారు. నిర్వహణ లాభాలపై ఒత్తిడే దీనికి కారణమని అప్పుడే సంస్థ ప్రకటించింది.
ఈ క్రమంలో క్యూ2లో ఇంకా తగ్గించి 65 శాతమే ప్రకటించడం వెనుక ఒత్తిడి మరింత పెరిగిందన్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి అమెరికా వంటి ప్రధాన మార్కెట్లలో మాంద్యం పరిస్థితులతో భారతీయ ఐటీ రంగ కార్యకలాపాలపై అనిశ్చిత వాతావరణం నెలకొన్నది. మరోవైపు కొలువులను వీడిపోతున్న ఉద్యోగులను కాపాడుకునేందుకు సంస్థలు చేపడుతున్న చర్యలు సైతం లాభాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫోసిస్లో 50వేలకుపైగా బీపీఎం ఉద్యోగులున్నారు. ఇందులో మెజారిటీ ఉద్యోగులు భారత్లోనే పనిచేస్తున్నారు. ఇక క్యూ2లో 70 శాతం ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పేను టీసీఎస్ ప్రకటించింది. అయితే మిగతావారికి యూనిట్ల పనితీరు ఆధారంగా ఉంటుందని స్పష్టం చేసింది. టీం లీడర్ స్థాయిలదాకా క్యూ2 కోసం విప్రో కూడా 100 శాతం వేరియబుల్ పేను ప్రకటించింది.