TCS | ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గత ఆర్థిక సంవత్సరం నియామకాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మందికి పైగా నియమించుకున్నది. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో సుమారు 68 వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నది. ఒక ఆర్థిక సంవత్సరంలో 55 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోవాలన్న సంస్థ లక్ష్యానికంటే ఇది ఎక్కువ. గత జనవరి-మార్చి మధ్య 35,209 మందిని నియమించుకున్నది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,03,546 మందిని నియమించుకున్నట్లయింది. మార్చి నెలాఖరు నాటికి 5,92,195 మంది ఉద్యోగులు టీసీఎస్లో పని చేస్తున్నారు. వారిలో 153 దేశాల వారు ఉన్నారు. మొత్తం ఉద్యోగుల్లో మహిళలు 35.6 శాతం.
ఒక సంస్థలోని ప్రతిభావంతులైన నిపుణుల కోసం మరో సంస్థ అట్రిక్షన్ ప్రోత్సహించడం ఆందోళనకరం అని టీసీఎస్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రిక్షన్ పెరిగిపోయింది.
17.4 శాతం మంది ఉద్యోగులు అట్రిక్షన్ అయ్యారు. తొలి త్రైమాసికంలో 8.6 శాతం మంది ఉంటే, డిసెంబర్ త్రైమాసికంలో 11.9 శాతం మంది అట్రిక్షన్ వల్ల సంస్థను వదిలేశారు.
మార్చి నెలాఖరుతో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ నికర లాభం ఏడు శాతానికి పైగా పెరిగి రూ.9,926 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో టీసీఎస్ ఆదాయం రూ.50,591 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇది 43,705 కోట్లు మాత్రమే. 2020-21తో పోలిస్తే చివరి త్రైమాసికం ఆదాయంలో సుమారు 16 శాతం గ్రోత్ సాధించింది. టీసీఎస్ ఆదాయంలో రూ.50 వేల కోట్ల మార్క్ దాటిన తొలి సంస్థగా నిలిచింది.