న్యూఢిల్లీ : వచ్చే ఏడాది భారత్లో 15,000 మంది ఉద్యోగుల నియామకానికి ఫ్రాన్స్ టెక్ దిగ్గజం అటోస్ సన్నాహాలు చేపట్టింది. సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు భారత్లో ఇప్పటికే పనిచేస్తున్న 40,000 మంది ఉద్యోగులకు అదనంగా భారీ సంఖ్యలో నూతన నియామకాల వైపు మొగ్గుచూపుతున్నట్టు కంపెనీ సీఈఓ ఎలీ గిరార్డ్ తెలిపారు.
డిజిటలీకరణ వేగం పుంజుకోవడంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డిమాండ్ ఊపందుకోవడం నూతన ఉపాధి అవకాశాలకు బాటలుపరిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఈ నైపుణ్యాలు అధికంగా భారత యువతలో ఉన్నాయని చెప్పారు. భారత్లో మెరుగైన డిజిటల్ నైపుణ్యాలున్నాయని ఇది దేశానికి సానుకూలాంశమని అన్నారు.
అత్యాధునిక టెక్నాలజీలకు తోడు 5జీ సేవలు అందుబాటులోకి రావడం సేవా రంగంలో ఉన్న సంస్ధలకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. తాము హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సేవల్లోనూ ముందున్నామని, ఇక సైబర్ సెక్యూరిటీ సేవల్లో యూరప్లో అగ్రస్ధానంలో, ప్రపంచంలో రెండో స్ధానంలో ఉన్నామని అన్నారు. ఒకట్రెండు సంవత్సరాల్లో సైబర్ సెక్యూరిటీ సేవల్లో ప్రపంచంలోనే తాము నెంబర్వన్ స్ధానానికి చేరుకుంటామని గిరార్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు.