హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి దశలవారీగా ముగింపు పలుకుతున్నాయి. ఇప్పటికే 25 శాతం మందికిపైగా ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. మిగిలిన ఉద్యోగులు కూడా అక్టోబర్ నుంచి కార్యాలయాలకు రావాలని కంపెనీలు ఈ-మెయిల్స్ పంపడంతో వారంతా తమ స్వస్థలాల నుంచి హైదరాబాద్కు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. మరోవైపు అక్టోబర్లో రెండు ప్రధాన పండగలు ఉండడంతో ఐటీ ఉద్యోగులు కొంత వెలుసుబాటు కోరుతున్నారు. ఆ వినతులను కంపెనీలు అంగీకరిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగులు హైదరాబాద్లో నివాస ఏర్పాట్లు చేసుకొనేందుకు కావాల్సినంత సమయాన్ని ఇస్తున్నాయి. దీంతో 1-2 నెలల్లో పూర్తిగా ఐటీ ఆఫీసులకు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య 40% వరకు పెరగవచ్చని, మిగతా ఉద్యోగులంతా మరికొంత కాలంపాటు హైబ్రిడ్ విధానంలో 3 రోజుల ఆఫీసు నుంచి, 2 రోజులు ఇంటి నుంచి పనిచేసే అవకాశాలున్నాయని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల తెలిపారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లోని కంపెనీల్లో 1,200కుపైగా కంపెనీలు ఐటీ సర్వీసెస్, ఐటీ ప్రొడక్ట్, బీపీవో, జీసీసీ క్యాటగిరీలో ఉన్నాయి. ఇప్పటికే ఐటీ ప్రొడక్ట్, బీపీవో కంపెనీల్లో 70 నుంచి 80 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల నుంచే పనిచేస్తున్నారు. ఐటీ సర్వీసెస్, జీసీసీ కంపెనీల్లో మాత్రం 10-15 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ఆఫీసుల్లో పనిచేస్తున్నారు. మిగతావారిలో కొందరు పూర్తిగా వర్క్ ఫ్రం హోం పద్ధతిలో, మరికొందరు హైబ్రిడ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. సంక్రాంతి వరకు ఇదే విధానం కొనసాగవచ్చని, వచ్చే ఏడాది మార్చి తర్వాతే ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే అవకాశం ఉన్నదని కృష్ణ ఏదుల అభిప్రాయపడ్డారు.
హైబ్రిడ్ విధానానికే మొగ్గు
కరోనా లాక్డౌన్ కారణంగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల ఉద్యోగులు 2020 మార్చి నుంచి వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేసున్నారు. దీనిపై కంపెనీలు చాలా నెలలపాటు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత ఇష్టం ఉన్నవారు ఆఫీసుకు వచ్చి పనిచేయాలని సూచించడంతో కంపెనీల పనితీరు బట్టి 20-25 శాతం మంది ఆఫీసుల నుంచి, మిగిలినవారిలో కొందరు హైబ్రిడ్ విధానంలో పనిచేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తున్నారు. ఇలాంటి వారంతా హైబ్రిడ్ విధానంలో పనిచేసేందుకు మొగ్గు చూపుతుండటంతో పలు కంపెనీలు ఆ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీంతో మరికొంత కాలంపాటు హైబ్రిడ్ విధానం కొనసాగే అవకాశాలున్నాయని ఐటీ కంపెనీల ప్రతినిధులు చెప్తున్నారు.
బీఎఫ్ఎస్ఐ కంపెనీల్లో 70% మంది ఆఫీసుల్లోనే
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల్లో ఐటీ సేవలతోపాటు ఐటీ ఆధారిత సేవల కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. వీటిలో ప్రధానమైన బ్యాకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగుల్లో ఇప్పటికే 70% మందికిపైగా ఆఫీసులకు వచ్చి పనిచేస్తున్నారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరగనుండటంతో కొత్త ఆఫీస్ స్పేస్ను తీసుకొంటున్నట్టు డీఈషా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఐటీ కంపెనీలతో పోల్చితే బీఎఫ్ఎస్ఐ కంపెనీల్లో ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీ బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులను పూర్తిస్థాయిలో ఆఫీసులకు రప్పించేందుకు మొగ్గు చూపుతున్నాయి.