Startup | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: స్టార్టప్ల్లో పెట్టుబడి చేసిన మదుపుదారుల ఆర్థిక స్థోమతను తెలియచేయాల్సిన బాధ్యత ఇన్వెస్ట్మెంట్ పొంది న కంపెనీ ఆదాయపు పన్ను శాఖ స్టార్టప్ యాజమాన్యాలకు షాక్ ఇచ్చింది. దేశంలోని కొన్ని స్టార్టప్ సంస్థలకు ఐటీ శాఖ నోటీసులు జారీచేసింది. ఇన్వెస్టర్లు వారి రిటర్న్ల్లో డిక్లేర్ చేసిన ఆదాయానికి తగినరీతిలో పెట్టుబడి మొత్తం ఉందో లేదో చూసుకోవాల్సింది స్టార్టప్లేనని తెలిపింది. స్టార్టప్లకు జారీఅయిన నోటీసులకు స్పందనగా సోషల్ మీడియాలో భారత్పే సహ వ్యవస్థాపకుడు అష్నీన్ గ్రోవర్ చేసిన పోస్టుకు ఐటీ శాఖ సమాధానమిస్తూ చట్ట ప్రకారం ఇన్వెసర్ల గుర్తింపు వివరాల్ని, ఆర్థిక స్థోమతను, లావాదేవీ నిజాయితీని ఐటీ శాఖకు వెల్లడించాల్సిన బాధ్యత అసెస్సీ కంపెనీదేనని వివరించింది.
ఐటీ రిటర్న్లను స్టార్టప్ ఎలా ఇస్తాయి?
షేర్హోల్డర్ల సమాచారం ఇవ్వాలంటూ గత నెలరోజులుగా పలు స్టార్టప్లకు ఐటీ శాఖ నోటీసులు అందుకున్నాయి’ అంటూ ట్విట్టర్ (ఎక్స్)లో గ్రోవర్ పోస్టు చేశారు. ‘ఇది చాలా ఆసక్తికరం. షేర్హోల్డర్ల అందరివీ మూడేండ్ల ఐటీ రిటర్న్లు వారు (ఐటీ శాఖ) అడుగుతున్నారు. షేర్హోల్డరు వారి ఐటీఆర్ను ఒక ప్రైవేట్ కంపెనీకి ఎందుకు ఇస్తారు? ఇన్వెస్టర్ల ఆర్థిక స్థోమతను తెలుసుకోవడం కోసం రిటర్న్లు కోరుతున్నామన్నారు. కంపెనీ షేర్హోల్డర్లకు రుణాలేవీ ఇవ్వడం లేదు కదా? ఇన్వెస్టర్లే కంపెనీ ఈక్విటీలో పెట్టుబడి చేస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని పరిశీలించాలి’ అంటూ గ్రోవర్ పోస్టులో వాదించారు. ఇందుకు బదులుగా ఎక్స్లో ఐటీ శాఖ చేసిన పోస్టులో ‘ఐటీ చట్టం సెక్షన్ 68 కింద షేర్హోల్డరు/ఇన్వెస్టరు ఆర్థిక వివరాలపై అసెస్సింగ్ అధికారి దర్యాప్తు చేయడం తప్పనిసరి. సెబీ వద్ద రిజిస్టర్ అయిన వెంచర్ క్యాపిటల్ కంపెనీలు మినహా మిగిలిన ప్రైవేటు కంపెనీలకు వచ్చిన నిధుల వివరాల్ని సెక్షన్ 68 కింద తెలియపర్చాల్సిందే’ అని తెలిపింది.
ఇది ట్యాక్స్ టెర్రరిజం: పాయ్
స్టార్టప్లకు నోటీసులు జారీఅయిన ఉదంతంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టరు మోహన్దాస్ పాయ్ స్పందిస్తూ ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని వ్యాఖ్యానించారు. తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదికి, ప్రధానమంత్రి కార్యాలయానికి గ్రోవర్ తొలి పోస్టును ట్యాగ్ చేస్తూ ‘ట్యాక్స్ టెర్రరిజం పెరిగిపోతున్నది. మీరు ఎందుకోసం నిలబడ్డారో దానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. దయచేసి జోక్యం చేసుకోండి’ అని పాయ్ పేర్కొన్నారు. ఇదే పోస్టును పలువురు రాజకీయవేత్తలకు, మంత్రులకు ట్యాగ్ చేశారు. ఐటీ రిటర్న్లకు బదులు ఇన్వెస్టర్ల పాన్ ఇవ్వాలంటూ ఐటీ శాఖ సమాధానం ఇచ్చిన తర్వాత పాయ్ మరో పోస్టు చేస్తూ ‘ఇది మళ్లీ తప్పుదోవ పట్టించడమే’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖను, ప్రధాని మోదీని, ఆర్థిక మంత్రి సీతారామన్ను ట్యాగ్ చేశారు.