No WFH in IT Cos | కరోనా మహమ్మారి నేపథ్యంలో గత రెండున్నరేండ్లుగా వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలు చేసిన ఐటీ సంస్థలు.. ఇప్పుడు తమ సిబ్బందిని ఆఫీసులకు రప్పించడానికి మొగ్గు చూపుతున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి వర్క్ ఫ్రం ఆఫీసుకు మళ్లితేనే అలవెన్స్లు, ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయని, లేకపోతే బదిలీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. వర్క్ ఫ్రం ఆఫీసుకు సుముఖత వ్యక్తం చేసే నిపుణులకు అదనపు సెలవులు, ఎక్కువ వేరియబుల్ శాలరీతోపాటు టీం సభ్యుల మధ్య అనుబంధం బలోపేతానికి ఎంటర్టైన్మెంట్, హాస్పిటాలిటీకి నిధులు పెంచడానికి ముందుకు వస్తున్నాయి.
పరిపరివిధాలుగా చెప్పినా వర్క్ ఫ్రం హోం సేవలందించేందుకు ప్రాధాన్యం ఇచ్చే ఉద్యోగులకు ఇంటర్నెట్ అలవెన్స్తోపాటు ఇతర వసతులు తగ్గించడానికి కూడా ఐటీ సంస్థలు వెనుకాడటం లేదని తెలుస్తున్నది. కనీసం వారానికి మూడు రోజులైనా కంపెనీ ఆఫీసులకు రావాలని కొన్ని కంపెనీలు కోరుతున్నాయి. ఇక కీలక ప్రాజెక్టుల్లో పని చేస్తున్న సిబ్బంది తప్పనిసరిగా ఆఫీసులకు వచ్చి విధులు నిర్వర్తించాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. దీంతో వివిధ ఐటీ సంస్థల్లో ఆఫీసులకు వచ్చే ఉద్యోగులు, నిపుణుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు సమాచారం.
కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రతిభావంతులైన ఐటీ నిపుణులకు గిరాకీ పెరిగింది. ఐటీ సేవలకు డిమాండ్ ఎక్కువ అవ్వడంతోపాటు దండిగానే ప్రాజెక్టులు వస్తుండటం, అధిక వేతన ప్యాకేజీలకు ఇతర సంస్థల నుంచి ఐటీ నిపుణుల అట్రిక్షన్ల (వలస)ను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఈ అట్రిక్షన్లు 15-20 శాతం మధ్య ఉన్నాయి. మంచి వేతన ప్యాకేజీ ఇచ్చే సంస్థలకు వెళ్లేందుకు ఐటీ నిపుణులు మొగ్గుతున్నారు. గత ఏడాదిన్నరగా అట్రిక్షన్ల ధోరణి ఎక్కువైంది. దీనికితోడు కాలేజీ క్యాంపస్ల్లో ఫ్రెషర్లను ఎంపిక చేస్తుండటంతో తాజాగా ఐటీ కంపెనీల్లో నియమితులవుతున్న వారిలో కొత్త వారు 30 నుంచి 40 శాతం మంది ఉంటున్నారు.
ఫ్రెషర్లకు ఉద్యోగంలో చేరగానే కంపెనీలో పని పరిస్థితులు, ఆయా ప్రాజెక్టులు టేకప్ చేసే విధానం, కంపెనీల లక్ష్యాలపై పూర్తిగా అవగాహన ఉండదని ఐటీ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. అందుకే ఫ్రెషర్లు ఆఫీసుకు వచ్చి ని చేయాలని సూచిస్తున్నట్లు చెప్పారు. క్యాంపస్ సెలెక్షన్లలో నియమితులయ్యే ఇంజినీర్లకు దాదాపు ఐదు నెలల వరకు వర్క్ ఫ్రం హోం సేవలు అందించడానికి అనుమతిస్తున్నామని ఆ ప్రతినిధులు చెబుతున్నారు. కాసింత అనుభవం రాగానే.. ప్రాజెక్టుల్లో పూర్తిగా లీనమయ్యే పరిస్థితి వచ్చాక ఆఫీసులకు రావాలని పిలుస్తున్నట్లు తెలిపారు.
వర్క్ ఫ్రం హోం సేవల వల్ల ఆయా ఐటీ కంపెనీలకు ఆఫీసు అద్దె, విద్యుత్, రవాణా, ఇంటర్నెట్ తదితర ఖర్చులు తగ్గాయి. లాభాలు పెంచుకునే చాన్స్ వచ్చింది. అయితే టీంగా పని చేస్తే సానుకూల పరిస్థితులున్నాయి. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు డేటా సెక్యూరిటీ, సమర్ధవంతంగా విధుల నిర్వహణ, ప్రొడక్షన్ మెరుగుదలను పరిగణనలోకి తీసుకోవడం వల్ల సిబ్బంది.. ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని ఐటీ పరిశ్రమ ప్రతినిధులు అంటున్నారు.
వర్క్ ఫ్రం హోం వల్ల డేటా సెక్యూరిటీ తదితర విషయాల్లో ఖర్చు పెరుగుతుందని, వర్క్ ఫ్రం ఆఫీసుకు మళ్లితే ఆ ఖర్చు తగ్గుతుందని ఐటీ పరిశ్రమ వర్గాలు వాదిస్తున్నాయి. ఆఫీసు నుంచి పని చేయడం వల్ల సకాలంలో ప్రాజెక్టులు సురక్షితంగా, భద్రంగా పూర్తి చేసి క్లయింట్ల విశ్వాసం పొందొచ్చునంటున్నాయి. అందుకే సిబ్బందిని ఆఫీసులకు రావాలని చెబుతున్నట్లు ఐటీ సంస్థల వాదన.
ఇటీవలి కాలం వరకు ఐటీ సంస్థల్లో 15 నుంచి 20 శాతం మంది నిపుణులు మాత్రమే ఆఫీసులకు వస్తున్నారు. సుమారు 80 శాతం మంది వర్క్ ఫ్రం హోం సేవలందిస్తున్నారు. ఇప్పుడు 40 శాతం వరకు సిబ్బంది ఆఫీసులకు వస్తున్నారని సమాచారం. కొద్ది రోజుల్లోనే వర్క్ ఫ్రం ఆఫీసు విధానానికి సగం మంది మళ్లుతారని ఐటీ సంస్థల ప్రతినిధులు అంటున్నారు.
అయినా, కొన్ని ఐటీ సంస్థలు మాత్రం ఫ్లెక్సీ వర్కింగ్ పాలసీ అమలు చేస్తున్నాయి. అటువంటి సంస్థల్లో వారానికి రెండు నుంచి మూడు రోజులు ఆఫీసులకు వస్తే సరిపోతుంది. మిగతా రోజుల్లో వర్క్ ఫ్రం హోం సేవలు అందించాలి. మరి కొంత కాలం ఈ ఫ్లెక్సీ వర్కింగ్ పాలసీని కొన్ని ఐటీ సంస్థలు కొనసాగిస్తారని తెలుస్తున్నది.