OYO IPO | కరోనాతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఐపీవో ద్వారా నిధులు సేకరించాలని తలపెట్టిన ఆతిథ్య సేవల సంస్థ ఓయోకు అవరోధాలు ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐపీవో కోసం ఓయో దాఖలు చేసిన దరఖాస్తును తిరస్కరించాలని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి జోస్టల్ హాస్పిటాలిటీ లేఖ రాసింది.
ఓయో పేరెంట్ సంస్థ ఒరావెల్ స్టేట్.. ఇప్పటికీ క్యాపిటల్ స్ట్రక్చర్ ఖరారు చేయకుండా రూ.8,430 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా ఐపీవో నిర్వహణ సాధ్యం కాదని ఆ లేఖలో పేర్కొంది. ఐపీవోకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సమర్పించిన పత్రాల్లో చాలా తప్పుల తడక అని అభిప్రాయ పడింది. ప్రజలను, మదుపర్లను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నదని ఆరోపించింది.
గతంలో జోస్టల్ను టేకోవర్ చేసుకోవడానికి 2016లో ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగణంగా ట్రాన్సాక్షన్స్ జరుగలేదు. 2017 సెప్టెంబర్ వరకూ జాప్యం చేయడంతో జోస్టల్.. ట్రిబ్యునల్స్ను ఆశ్రయించింది. కానీ జోస్టల్కు ప్రతికూలంగా తీర్పు వచ్చింది. నిర్దిష్ట నిబంధనలు ఖరారు కాలేదని, ఓయో చేసిన వాదనలతో ట్రిబ్యునల్ ఏకీభవించింది.
ఈ నేపథ్యంలోనే జోస్టల్ తమకు తప్పుడు ఉద్దేశాలు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఓయో ఆరోపించింది. ఓయో.. జోస్టల్ మధ్య వివాదం నేపథ్యంలో ఓయో ఐపీవో జాప్యమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.