CBDT New Cheif | కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్గా ఐఆర్ఎస్ అధికారి నితిన్ గుప్తా నియమితులయ్యారు. 1986 బ్యాచ్కు చెందిన నితిన్ గుప్తా వచ్చే ఏడాది సెప్టెంబర్లో రిటైర్ అవుతారు. ప్రస్తుతం సీబీడీటీ బోర్డు (ఇన్వెస్టిగేషన్) సభ్యులుగా ఉన్నారు. ఇంతకుముందు సీబీడీటీ చైర్మన్గా ఉన్న జేబీ మెహాపాత్ర గత ఏప్రిల్ 30వ తేదీన రిటైర్ అయ్యారు. ఆయన స్థానంలో తాత్కాలికంగా సీబీడీటీ చైర్పర్సన్గా సంగీతా సింగ్ను కేంద్రం నియమించింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో నితిన్ గుప్తాను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 25న జరిగిన కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది.
ప్రస్తుతం చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగీతా సింగ్.. ఇక ముందు సీబీడీటీ సభ్యులుగా కొనసాగుతారు. సీబీడీటీ ప్రత్యక్ష పన్నుల విధానాన్ని ఖరారు చేస్తుంది. సీబీడీటీలో చైర్మన్తోపాటు ఆరుగురు సభ్యులు ఉంటారు. సంగీతా సింగ్ 1986 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి కాగా, 1985 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి అనుజా సారంగి సీనియర్ సభ్యులు. 1987 బ్యాచ్కు చెందిన ప్రగ్యా సహాయ్ సక్సేనా, శుభశ్రీ అనంత్ కృష్ణన్ కూడా సభ్యులుగా ఉన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.14.2 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ నెల మధ్య వరకు నికర ప్రత్యక్ష పన్నుల రూపేణా రూ.3.39 లక్షల కోట్లు (45 శాతం) వసూలయ్యాయి.