న్యూఢిల్లీ, ఆగస్టు 16: డిజిన్వెస్ట్మెంట్ పేరుతో ఇప్పటికే కొన్ని కంపెనీలను, పలు సంస్థల్లో వాటాల్ని విక్రయించిన కేంద్ర ప్రభుత్వం మరోదానిపై తాజాగా దృష్టిపెట్టింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ)లో కొంత వాటాను ఈ ఆర్థిక సంవత్సరం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా ఆఫ్లోడ్ చేస్తామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. ప్రస్తుతం ఐఆర్ఎఫ్సీలో కేంద్రానికి 86.36 శాతం వాటా ఉంది. ఎంత శాతం వాటాను అమ్మాలనే నిర్ణయం తీసుకునేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం), రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంప్రదింపులు ప్రారంభించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
11 శాతం వాటా విక్రయం
ఏ లిస్టెడ్ కంపెనీలోనైనా, అది లిస్టయిన ఐదేండ్లలోగా ప్రమోటర్లు వారి వాటాను 75 శాతానికి తగ్గించుకోవాలన్నది సెబీ నిబంధన. ఆ ప్రకారం కనీస పబ్లిక్ షేర్హోల్డింగ్ (ఎంపీఎస్) 25 శాతం ఉంచాలి. ఈ నిబంధన మేరకు ఐఆర్ఎఫ్సీలో ప్రభుత్వం 11.36 శాతం వాటాను విక్రయించవచ్చని అంచనా. బుధవారం బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు ధర ఆల్టైమ్ రికార్డుస్థాయి రూ.52,70 వద్దకు చేరిన అనంతరం చివరకు రూ.50.97 వద్ద ముగిసింది. ఈ ధరపై 11.36 శాతం వాటాను విక్రయిస్తే ప్రభుత్వ ఖజానాకు రూ. 7,600 కోట్లు సమకూరుతాయి. 2021 జనవరిలో ఐఆర్ఎఫ్సీని స్టాక్ ఎక్సేంజీల్లో ప్రభుత్వం లిస్ట్ చేసింది. 2023 జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ నికరలాభం రూ. 1,660 కోట్ల నుంచి రూ. 1,557 కోట్లకు తగ్గింది. ఈ నెలలోనే ఐఆర్ఎఫ్సీ షేరు 38 శాతం పెరిగింది.