న్యూఢిల్లీ, అక్టోబర్ 30: బీమా పాలసీ తీసుకున్నవారికి ఆ పాలసీ ప్రాధమిక వివరాలు, షరతులు సులభంగా అర్థమయ్యే రీతిలో నిర్దేశిత ఫార్మాట్లో వచ్చే జనవరి 1 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంత మొత్తానికి పాలసీ తీసుకున్నారు? పాలసీ కవర్ చేసేవి ఏమిటి? చేయనివి ఏమిటి? క్లెయిం ఎలా పొందాలి?..ఇటువంటి సమాచారాన్నంతటినీ పాలసీదార్లకు అందించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) ప్రస్తుత కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (సీఐఎస్)ను సులభంగా అర్థమయ్యే రీతిలో సవరించింది.
ఈ సవరించిన సీఐఎస్లోనే 2024 జనవరి 1 నుంచి వివరాల్ని పొందుపర్చాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశిస్తూ ఐఆర్డీఏ ఒక సర్క్యులర్ జారీచేసింది. పాలసీదారు తాను తీసుకున్న పాలసీ నియమ నిబంధనలు, షరతుల్ని అర్థం చేసుకోవడం ముఖ్యమని ఐఆర్డీఏ తెలిపింది. పాలసీ డాక్యుమెంట్ సాంకేతికమైన లీగల్ పరిభాషలో ఉంటున్నందున, పాలసీ వివరాల్ని సరళమైన పదాల్లో తెలియపర్చాల్సిన అవసరం ఉందని సర్క్యులర్లో వివరించింది. ఇన్సూరెన్స్ కంపెనీ, పాలసీ హోల్డరు మధ్య సమాచార లోపం కారణంగా పలు ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలోనే సవరించిన సీఐఎస్ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది.
సీఐఎస్లో అంశాలివి..
కొత్త సీఐఎస్ ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు ’పాలసీ పేరు, నంబరు, ఏ విధమైన పాలసీ, బీమా చేసిన మొత్తం, పాలసీ కవరేజి (హాస్పిటల్ వ్యయాలు తదితరాలు), మినహాయింపులు (పాలసీ కింద కవర్కానివి), కవరేజ్ ఆర్థిక పరిమితులు, క్లెయిం చేసుకునే విధానం, వివాదాలు/ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం వివరాలు తదితరాల్ని తెలియపరుస్తాయి. పాలసీదార్లు అందరికీ కొత్త సీఐఎస్ను ఇన్సూరెన్స్ సంస్థలు, ఏజెంట్లు,ఇంటర్మీడియరీలు ఇవ్వాలని, వారికి అందినట్టు ధృవీకరణ తీసుకోవాలని ఐఆర్డీఏ సర్క్యులర్లో ఆదేశించింది. ప్రాంతీయ భాషలో కూడా సీఐఎస్ను అందించాలన్నది.