బెంగళూరు, జూన్ 3: పబ్లిక్ ఇష్యూ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ లేదా ఐపీవో)లు ఆర్థిక ప్రత్యామ్నాయాలు కావని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ఆర్ నారాయణ మూర్తి శుక్రవారం అన్నారు. ఎంటర్ప్రెన్యూర్స్ తమ నిధుల సమీకరణకు ఐపీవోలవైపు చూడటం మంచిది కాదని ఈ ఐటీ దిగ్గజం హితవు పలికారు. కర్నాటక డిజిటల్ ఎకానమీ మిషన్, కాటమరాన్ వెంచర్స్, టాటా డిజిటల్ భాగస్వామ్యంతో స్విట్జర్లాండ్కు చెందిన వ్యూహాత్మక అడ్వైజరీ కంపెనీ స్మద్జా అండ్ స్మద్జా నిర్వహించిన స్టార్టప్లపై గ్లోబల్ కాన్ఫరెన్స్ ‘ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ కనెక్ట్’లో మూర్తి పాల్గొన్నారు. కాటమరాన్ వెంచర్స్ వ్యవస్థాపక చైర్మన్గా కూడా ఉన్న మూర్తి మాట్లాడుతూ.. ‘ఐపీవోలను తదుపరి ఆర్థిక అవసరాల కోసం వాడుకుంటున్నారు. నాకిది సరికాదనిపిస్తున్నది. ఎందుకంటే ఎన్నో బాధ్యతలతో ఈ ఐపీవో అన్నది ముడిపడి ఉంటుంది’ అన్నారు.
ఐపీవోకు ఇన్ఫోసిస్ను తీసుకెళ్లేముందు తనకు, తోటి సహవ్యవస్థాపకుడికి మధ్య జరిగిన సంభాషణను ఈ సందర్భంగా మూర్తి తెలియజేశారు. ‘ఐపీవో మనపై బరువైన బాధ్యతను మోపుతుంది. ఎంతోమంది మన సంస్థపై నమ్మకంతో వారివారి కష్టార్జితాలను పెట్టుబడిగా పెడుతారు. ఇందుకోసం కొద్దిపాటి ఆదాయాన్ని కూడా వదులుకుంటారు. కాబట్టి వారి పెట్టుబడులకు ధీటైనవిధంగా మనం ప్రతిఫలాల్ని ఇవ్వడం చాలా ముఖ్యం’ అన్నట్టు మూర్తి వివరించారు. నిజానికి మార్కెట్ పరిమాణాన్ని మనం కచ్ఛితంగా అంచనా వేయలేకపోతున్నామని, అందుకు తగిన మార్కెట్ రిసెర్చ్ సంస్థలూ దేశంలో లేవని చెప్పారు. ఈ క్రమంలోనే మార్కెట్లను ఎక్కువగా అంచనా వేస్తున్నామని వ్యాఖ్యానించారు.
నేటి వ్యాపార-పారిశ్రామికవేత్తలు, కంపెనీల వ్యవస్థాపకులు ఎంతో తెలివైనవారని ఈ సందర్భంగా మూర్తి ప్రశంసించారు. ఈ క్రమంలోనే అప్పటితో పోల్చితే ఇప్పటోళ్లు నాకన్నా స్మార్ట్ అంటూ కొనియాడారు. కాగా, ప్రతీ ఎంటర్ప్రెన్యూర్ విజయం వెనుక కస్టమర్లు లేదా మార్కెట్ను ఆకర్షించడం, ప్రతిభను గుర్తించి అందిపుచ్చుకోవడం, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ లభ్యత అనేవే ప్రధానంగా ఉంటాయన్నారు.