Investers Wealth | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ నష్టాల నుంచి రికవరీతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఆటో స్టాక్స్ మద్దతుతో బుధవారం వరుసగా రెండోరోజు స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 278 పాయింట్ల లబ్ధితో 71,833 పాయింట్ల వద్ద.. ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ 97 పాయింట్లు పుంజుకుని 21,840 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.
దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.14 లక్షల కోట్లు పెరిగి రూ.384.89 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బీఎస్ఈ స్టాక్స్లో 2425 స్టాక్స్ లబ్ధి పొందితే, 1425 స్క్రిప్ట్లు నష్టపోయాయి. మరో 88 స్టాక్స్ యధాతథంగా ముగిశాయి. ఇక ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం బుధవారం 10శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్ ను తాకింది. గత నెల 31 నుంచి పది సెషన్లలో పేటీఎం రూ.26 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది.
బీఎస్ఈలో ఎస్బీఐ, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎన్టీపీసీ 2-4 శాతం లాభ పడితే, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టీసీఎస్, ఇన్పోసిస్, 1-3 శాతం మధ్య నష్టపోయాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్పోసిస్ 2.8 శాతంతో బీఎస్ఈలో భారీగా నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీలో పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 3.2 శాతం పుంజుకున్నది. ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఐదు శాతానికి పైగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, యూకో బ్యాంక్ నాలుగు శాతానికి పైగా లాభ పడ్డాయి.