న్యూఢిల్లీ, మే 13: అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల కారణంగా స్టాక్ పెట్టుబడుల్లో మదుపరులు జాగ్రత్త వహిస్తున్నారు. ఇందుకు సంకేతంగా ఏప్రిల్ నెలలో దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. ముగిసిన ఏప్రిల్లో నెలలో ఈ ఫండ్స్లో ఇన్వెస్టర్లు నికరంగా కేవలం రూ. 6,480 కోట్లు మాత్రమే పెట్టుబడి చేశారు. 2023 మార్చిలో వచ్చిన పెట్టుబడులకంటే ఏప్రిల్లో 68 శాతం తక్కువ వచ్చినట్టు ఆసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) గురువారం విడుదల చేసిన డాటాలో వెల్లడైంది. అంతక్రితం నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రికార్డుస్థాయిలో రూ.20,534 కోట్లు వచ్చాయి. అయితే ఏప్రిల్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్లోకి (బాండ్లలో మదుపు చేసే ఫండ్స్) పెట్టుబడులు జోరుగా పెరిగాయి. ఈ ఫండ్స్ ఏకంగా రూ.1.21 లక్షల కోట్లు ఆకర్షించాయి. అంతకు ముందు నెలలో డెట్ ఫండ్స్ నుంచి రూ. 19,263 కోట్ల నిధులు తరలి వెళ్లాయి. ఈక్విటీలో అదనపు పెట్టుబడులు చేసేందుకు ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నట్టు తాము భావిస్తున్నామని, వారి ప్రస్తుత సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్) ఖాతాల్లోకి చెల్లింపులు మాత్రం కొనసాగిస్తున్నారని కొటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మార్కెటింగ్ హెడ్ మనీష్ మెహతా చెప్పారు.
కొద్ది నెలలుగా స్టాక్స్ విలువలు బాగా పెరగడంతో తాజా పెట్టుబడులకు ఇన్వెస్టర్లు దూరంగా ఉంటున్నారని, అలాగే ర్యాలీని ఉపయోగించుకొని కొంత మదుపును వెనక్కు తీసుకుంటున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ శ్రీరామ్ వివరించారు. ఇటీవలి మార్కెట్ ర్యాలీ కారణంగా మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్లో ఈక్విటీ ఫండ్స్లోకి పెట్టుబడులు తగ్గాయని మోతీలాల్ ఓస్వాల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది చెప్పారు. ఇది ఇన్వెస్టర్ల జాగురూకతను సూచిస్తున్నదని అన్నారు. ఏప్రిల్ నెలలో నిఫ్టీ-50 సూచీ 4 శాతం పెరిగింది. ఇదే నెలలో సిప్ల ద్వారా ఫండ్స్ వసూళ్లు రూ. 13,727 కోట్లకు తగ్గాయి. మార్చిలో ఇవి రూ.14,276 కోట్లు. తాము సిప్ పెట్టుబడుల పట్ల పాజిటివ్గా ఉన్నామని, ఈ ఆర్థిక సంవత్సరాంతానికి నెలవారీ సగటు సిప్ మార్గంలో వచ్చే పెట్టుబడులు రూ.17,000-18,000 కోట్ల మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నట్టు యాంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ఎస్ వెంకటేష్ వివరించారు.