Investers Wealth | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనంతో ఇన్వెస్టర్ల పంట పండింది. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద 4.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల స్క్రిప్ట్ల దన్నుతో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1335.05 పాయింట్లు (2.25 శాతం) లాభ పడి తిరిగి 60 వేల మార్క్ను దాకింది. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు.
బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,72,46,213.52 కోట్లకు దూసుకెళ్లింది. శుక్రవారం ముగిసిన ట్రేడింగ్లో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఎం-క్యాప్ రూ. 2,67,88,386.93 కోట్లు కాగా, సోమవారం రూ.4,57,826.69 కోట్లు పెరిగింది. బీఎస్ఈ డేటా ప్రకారం 179 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.
బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్ల్లో ఫైనాన్స్ 4.25 శాతం, బ్యాంకెక్స్ 3.45, పవర్ 3, యుటిలిటీస్ 2.93, క్యాపిటల్ గూడ్స్ 1.79 శాతం లాభాలతో ముగిసాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 1.68 శాతం లబ్ధి పొందాయి. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 భారీగా లబ్ధి పొందడంలో హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్ల వాటా 70 శాతానికి పైగా ఉందని ట్రేడింగ్గో ఫౌండర్ పార్థ్ న్యాతి చెప్పారు.