న్యూఢిల్లీ : టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇటీవల 12,000 మంది ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్ లేఆఫ్స్ ప్రక్రియను ముమ్మరం చేసింది. గూగుల్లో మాస్ లేఆఫ్స్ ఇక్కడితో సమసిపోలేదని ఈ ఏడాది పెద్దసంఖ్యలో టెకీలపై వేటు తప్పదనే సంకేతాలు వెల్లడవుతున్నాయి. సెర్చింజన్ దిగ్గజంలో కొలువుల కోతపై కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన క్రిస్ హాన్ పెదవివిరిచారు.
తాజా లేఆఫ్స్తో ఖర్చులు పెద్దగా తగ్గవని, వీటికి అదనంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని హాన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు సూచించారు. 20 శాతం సిబ్బందిపై వేటు వేయాలని పిచాయ్ను హాన్ కోరారు. గూగుల్ మాతృసంస్ధ అల్ఫాబెట్లో హాన్కు 600 కోట్ల డాలర్ల విలువైన వాటా ఉంది. గూగుల్ మొత్తం ఉద్యోగులను 1,50,000 మందికి కుదించాలని పిచాయ్కు రాసిన లేఖలో హాన్ సూచించారు.
గూగుల్ ఇప్పటికే ఆరు శాతం ఉద్యోగులను తొలగించింది. హాన్ సూచన మేరకు మరో 14 శాతం మంది ఉద్యోగులపై గూగుల్ వేటు వేయాలి. గూగుల్లో 12,000 మంది ఉద్యోగులను తొలగించకముందు కూడా కంపెనీ ఇన్వెస్టర్ లేఖ రాశారు. గత ఐదేండ్లలో కంపెనీలో లక్ష మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారని ఆ లేఖలో హాన్ పేర్కొన్నారు.