హైదరాబాద్, ఏప్రిల్ 30: అంతర్జాతీయ ఫిన్టెక్ సేవల సంస్థ మోడిఫై..దక్షిణ భారతంలో తన వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నది. ఇప్పటికే ముంబై, ఢిల్లీలో కార్యాలయాలు ఉండగా..దక్షిణాదిలో వ్యాపార విస్తరణకోసం హైదరాబాద్తోపాటు బెంగళూరులలో నూతన కార్యాలయాన్ని తెరువాలనుకుంటున్నట్లు మోడిఫై ఇండియా కంట్రీ హెడ్ సచిన్ నిగం తెలిపారు.
వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో హైదరాబాద్లో ఏర్పాటు చేయతలపెట్టిన కార్యాలయం అందుబాటులోకి రానున్నట్లు, ఆ తర్వాత బెంగళూరులో ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం సంస్థలో 100కి పైగా ఉద్యోగాలు ఉన్నారని, కొత్త ఆఫీస్లతో మరో 20 వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎగుమతిదారులకు ఆర్థిక సేవలు అందించే సంస్థకు తెలుగు రాష్ర్టాల నుంచి అధిక సంఖ్యలో కస్టమర్లు ఉన్నారని, దీంతో ఇక్కడ ఆఫీస్ తెరువాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతర్జాతీయంగా సంస్థ 2.5 బిలియన్ డాలర్ల మేర ఫైనాన్స్ చేసిందని, వీటిలో భారత్లోనే 1.5 బిలియన్ డాలర్లు ఇచ్చినట్లు చెప్పారు.