న్యూఢిల్లీ, మే 17: బాలికలు, మహిళల కోసం ఫిబ్రవరి బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన పథకంపై పన్ను వేస్తున్నట్టు తాజాగా నోటీఫై చేశారు. మహిళా సమ్మాన్ సర్టిఫికెట్ పేరుతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ప్రారంభించిన స్కీమ్ కింద పోస్టాఫీసులు, ఎంపికచేసిన బ్యాంక్ల్లో బాలికలు, మహిళల పేరిట గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ను రెండేండ్లు పూర్తయిన తర్వాత 7.5 శాతం వడ్డీతో చెల్లిస్తారు. ఒక ఏడాది తర్వాత కూడా తీసుకునే సదుపాయం ఉంది. 7.5 శాతం వడ్డీతో రూ.2 లక్షల పెట్టుబడిపై ఈ సర్టిఫికెట్ ఒక ఏడాదిలో రూ. 15,000, రెండేండ్లలో రూ.32,000 ఆదాయాన్ని ఇస్తుంది. అయితే ఈ వడ్డీ ఆదాయంపై డిపాజిట్దారు చేతిలో ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను పడుతుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం ఒక నోటిఫికేషన్ జారీచేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చే వడ్డీ ఆదాయం రూ. 40,000 మించకపోతే పన్ను ను ఖాతా నుంచి టీడీఎస్గా కట్ చేయరని చార్టర్డ్ అకౌంటింగ్ సంస్థ నాంగియా యాండర్సన్ ఇండియా పార్టనర్ నీరజ్ అగర్వాలా చెప్పారు. అందుచేత మహిళా సమ్మాన్ సర్టిఫికెట్పై వడ్డీ ఆదాయానికి టీడీఎస్ వర్తించబోదంటూ సీబీడీటీ స్పష్టంచేసిందని ఆయన తెలిపారు.