2022 Economy Changes | మరి కొన్ని గంటల్లో 2022కి వీడ్కోలు పలికేందుకు యావత్ ప్రపంచం సన్నద్ధం అవుతున్నది. కరోనా మహమ్మారి ప్రభావంతో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. దాంతోపాటే సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. విశ్వమారి వేళ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ మార్గంగా కనిపించిన క్రిప్టో కరెన్సీల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. సైబర్ మోసాల నియంత్రణకు బ్యాంకుల ఖాతాదారుల డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల టోకెనైజేషన్.., క్రిప్టోల కట్టడికి డిజిటల్ రూపీ ఆవిష్కరణ వంటి చర్యలు చేపట్టింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). మరోవైపు కరోనా ముప్పు కాసింత తగ్గగానే ఉక్రెయిన్ మీద రష్యా గుడ్లురిమింది.
ఫలితంగా నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. వాటి కట్టడికి వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచేయడంతో ఇండ్లు, ఇతర రుణాలు పిరం అయ్యాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ముప్పు ముంచుకొస్తున్నది. ఈ తరుణంలో మరి కొన్ని గంటల్లో చరిత్ర కాలగర్భంలో కలిసిపోనున్న 2022లో ఆర్థిక పరిణామాలు, వాటి తీపి గుర్తుల ప్రభావం తెలుసుకుందాం..
గతంతో పోలిస్తే ఇప్పుడు క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. వాటి వినియోగంతోపాటు చార్జీలు, వినియోగదారులకు ప్రయోజనాలపై ఆర్బీఐ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఖాతాదారుడితో సంప్రదించకుండా క్రెడిట్ కార్డు జారీ సంస్థలు వారి క్రెడిట్ పరపతి కొత్తగా పెంచడం, కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడం వంటి చర్యలు చేపట్టకూడదు. క్రెడిట్ కార్డు దారుడు తన వీలును బట్టి బిల్లింగ్ సైకిల్ మార్చుకునేందుకు బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు అనుమతించాలి. అయితే బిల్లింగ్ తేదీ మార్చుకోవడానికి ఒకసారి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఇక తన క్రెడిట్ కార్డును రద్దు చేయాలని ఖాతాదారుడు కోరినప్పుడు.. ఎటువంటి బకాయిలు లేకపోతే ఏడు పని దినాల్లో ఆ ప్రక్రియ పూర్తి చేసేయాలి. అలా చేయడం జాప్యమైతే రోజుకు రూ.500 చొప్పున సంబంధిత క్రెడిట్ కార్డు దారుడికి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
కరోనా మహమ్మారి ముప్పు కాసింత తగ్గగానే ఉక్రెయిన్-రష్యా మధ్య మొదలైన యుద్ధం ప్రభావంతో దేశంలో వివిధ నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పాయి. వాటిని కట్టడి చేయడానికి ఆర్బీఐ ఎంటరైంది. గత మేలో మొదటిసారి అనూహ్యంగా భేటీ అయిన ఆర్బీఐ కీలక రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచేసింది. అలా ఇప్పటివరకు జరిగిన ప్రతి ద్రవ్య పరపతి సమీక్షలో రెపోరేట్ పెంచడంతో ఈ ఏడాది రెపోరేట్ 2.25 శాతం పెరిగింది. తదనుగుణంగా బ్యాంకులు తమ ఖాతాదారుల రుణాలపై వడ్డీరేట్ల భారం మోపాయి. ఫలితంగా ఇండ్లు, వాహనాలు, పర్సనల్ లోన్లపై ఈఎంఐలు భారం అయ్యాయి. అంతే కాదు వరుసగా తొమ్మిది నెలల పాటు ఆరు శాతానికి పైగా ద్రవ్యోల్బణం నమోదు కావడానికి దారి తీసిన పరిస్థితులపై గత అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
2016లో పాత పెద్దనోట్ల రద్దు.. 2020లో కరోనా మహమ్మారి ప్రభావంతో డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోయాయి. తదనుగుణంగానే సైబర్ నేరాలు, మోసాలు ఎక్కువయ్యాయి. మోసాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా జరిగే ఆన్ లైన్ పేమెంట్స్ సేఫ్టీ కోసం ఈ ఏడాదిలోనే టోకెనైజేషన్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆర్బీఐ. అన్ని రకాల ఆన్ లైన్ చెల్లింపు గేట్ వేలు, మర్చంట్లు, ఈ-కామర్స్ సంస్థలు తమ కస్టమర్ల కార్డుల టోకెనైజేషన్ అమలు చేయాలని కోరింది. ప్రత్యేకించి మర్చంట్లు తమ సర్వర్లలో వినియోగదారుల కార్డు వివరాలు స్టో్ర్ చేయకుండా ఆల్టర్నేటివ్గా కార్డ్ ఆన్ ఫైల్ (సీఓఎఫ్) టోకెనైజేషన్ అమలు చేయాలని పేర్కొంది.
కరోనా మహమ్మారి వేళ గరిష్ట స్థాయి విలువ నమోదు చేసుకున్న వర్చువల్ కరెన్సీలు ‘క్రిప్టో కరెన్సీ’లతో దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పని హెచ్చరించింది ఆర్బీఐ. కానీ, సుప్రీంకోర్టు జోక్యంతో ఆర్బీఐ విధించిన నిషేధం అమలు కాలేదు. ఇండియన్ ఇన్వెస్టర్లు ఇబ్బడి ముబ్బడిగా క్రిప్టోల్లో పెట్టుబడి పెట్టడంతో వారి పెట్టుబడులకు సేఫ్టీ కల్పిస్తూనే.. డిజిటల్ ఆస్తుల కట్టడి, లావాదేవీల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్లపై వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను, డిజిటల్ ఆస్తుల బదిలీపై ఒకశాతం టీడీఎస్ వసూలు చేయాలని 2022 ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 బడ్జెట్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. క్రిప్టో ఆదాయం, వాటి లాభ నష్టాలను సర్దుబాటు చేయడానికి కూడా అనుమతించలేదు. ఆదాయంపై పన్ను రాయితీలు కూడా ఇవ్వబోమని తేల్చేశారు. ఫలితంగా గత ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి.
క్రిప్టో కరెన్సీలను కట్టడి చేయడంతోపాటు డిజిటల్ లావాదేవీలు పెంచడానికి ఆర్బీఐ.. ‘డిజిటల్ రూపాయి’ అమల్లోకి తెచ్చింది. గత నవంబర్ ఒకటో తేదీన వినియోగంలోకి వచ్చిన డిజిటల్ రూపాయిని తొలుత ప్రయోగాత్మకంగా హోల్ సేల్ వినియోగానికి అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీల నిర్వహణకు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్ఎస్బీసీ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్.. డిజిటల్ రూపాయి జారీ చేశాయి. తాజాగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి డిజిటల్ రూపాయిని సెలెక్టెడ్ ప్రాంతాల్లో రిటైల్ వినియోగానికి పరిమిత కస్టమర్లు- మర్చంట్ల మధ్య వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుత కరెన్సీ నోట్లకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) డిజిటల్ రూపం మాత్రమే.. నోట్లకు ఎంత మాత్రమూ ప్రత్యామ్నాయం కాదు.
ఇక దేశీయ టెలికం రంగంలో నవ్యపథం ప్రారంభమైంది. అక్టోబర్ ఒకటో తేదీన మొదలైన 5జీ సేవలు తొలుత 13 సెలెక్టెడ్ నగరాల్లో అందుబాటులోకి వచ్చాయి. దశల వారీగా ఇతర నగరాలకు విస్తరిస్తున్నాయి టెలికం సంస్థలు. 4జీ సేవలతో పోలిస్తే 5జీతో 10 రెట్లు అధికంగా డేటా వేగంగా లభిస్తుంది. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు వినియోగదారులకు 5జీ సేవలు అందించడానికి రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రం కొనుగోలు చేశాయి. ఇక 5జీ సేవల రాకతో టెక్నాలజీ రంగంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. మెటావర్స్, ఆటోమేషన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో మానవుడి జీవితంలో కొత్త శకం ప్రారంభం కాబోతున్నది.