ముంబై, ఏప్రిల్ 12: దేశీయ బీమా వ్యాపార రంగంలోకి మరిన్ని సంస్థలు రాబోతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత దాదాపు మరో 20 బీమా సంస్థల దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశిష్ పాండా తెలిపారు. బుధవారం ఇక్కడ వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మరో 20దాకా ఇన్సూరెన్స్ అప్లికేషన్లు తమ పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఆరేండ్ల తర్వాత ఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చినట్టు వివరించారు.
క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థకు ఐఆర్డీఏఐ తాజాగా లైసెన్స్ ఇచ్చింది. 2017 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో జీవిత బీమా రంగంలోకి రెండు సంస్థల్ని ఐఆర్డీఏఐ అనుమతించిన విషయం తెలిసిందే. క్రెడిట్ యాక్సెస్ లైఫ్, ఆకో లైఫ్ సంస్థలకు లైసెన్సులు వచ్చాయి. 2011 తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు లైసెన్స్ రావడం ఇదే ప్రథమమని సదస్సులో భాగంగా విలేకరులతో పాండా తెలియజేశారు. కాగా, ప్రస్తుతం దేశంలో 23 జీవిత బీమా సంస్థలు, 33 జనరల్ బీమా కంపెనీలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.59 లక్షల కోట్లుగా, ప్రీమియం విలువ రూ.10 లక్షల కోట్లుగా ఉన్నది. వృద్ధిరేటు 16 శాతంగా నమోదైంది.
2047కల్లా దేశంలోని ప్రతి ఒక్కరికీ బీమా ఉండాలన్న లక్ష్యం కేవలం ఓ నినాదంగా చూడవద్దని, దీని సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా బీమా సంస్థలకు దేబాశిష్ పాండా పిలుపునిచ్చారు. నిర్దేశిత గడువులోగానే లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఈ క్రమంలో మరిన్ని ఆకర్షణీయ పథకాలను తీసుకురావాలని, సాంకేతికతనూ అందిపుచ్చుకోవాలని సూచించారు.