న్యూఢిల్లీ : ఐటీ ప్రాజెక్టుల్లో పనిచేసేందుకు ఫ్రెషర్స్ నియామకానికి టెక్ దిగ్గజాలు కసరత్తు సాగిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు 1.2 లక్షల మంది ఫ్రెషర్స్ను నియమించుకోనుండగా దాదాపు 1.5 లక్షల మందికి పైగా ఫ్రెషర్స్ ఈ ఏడాది క్యాంపస్ల నుంచి నేరుగా ఐటీ కారిడార్లలోకి అడుగుపెట్టనున్నారు.
మైండ్ట్రీ వంటి మధ్యశ్రేణి ఐటీ కంపెనీలు సైతం పెద్దసంఖ్యలో ఫ్రెషర్స్ను హైర్ చేయనున్నాయి. ఐటీ కంపెనీలకు భారీ ఆర్డర్లు వస్తున్న క్రమంలో బెంచ్పై ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులకు తగినంతగా లేకపోవడంతో టెకీల నియామకానికి మొగ్గుచూపుతున్నాయని మానవవనరుల కన్సల్టింగ్ సంస్థ ఎక్స్ఫెనో సహవ్యవస్ధాపకుడు కమల్ కారంత్ పేర్కొన్నారు. కంపెనీలు బెంచ్ సిబ్బందిని తిరిగి పటిష్టం చేసేందుకు సిద్ధమవడంతో రానున్న 12 నుంచి 18 నెలల్లో ఫ్రెషర్స్ నియామకాలు ఊపందుకుంటాయని చెప్పారు.
సీనియర్లు ఉద్యోగాలు మారేందుకు 70 శాతం వేతన పెంపును డిమాండ్ చేస్తుండటంతో వారి హైరింగ్ ఖరీదైన వ్యవహారంగా మారిందని అన్నారు. ఇక దేశీ టెక్ దిగ్గజాలు టీసీఎస్ ప్రడెన్షియల్ ఫైనాన్షియల్ నుంచి ప్రాజెక్టు దక్కించుకోగా, ఇన్ఫోసిస్కు దైమ్లర్ కాంట్రాక్ట్, విప్రో మెట్రో ఏజీ డీల్ను ఖరారు చేసుకున్నాయని ఫలితంగా ఆయా కంపెనీల్లో నియామకాల ప్రక్రియ ఊపందుకుంటుందని అంచనా వేశారు.