Mohit Joshi | ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ (Infosys President) పదవికి మోహిత్ జోషి (Mohit Joshi) రాజీనామా చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్లో వివిధ పదవుల్లో పని చేశారు. త్వరలో ఆయన టెక్ మహ్రీంద్రా (Tech Mahindra)లో చేరనున్నారు. టెక్ మహీంద్రా మోహిత్ జోషిని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో (Managing Director and CEO)గా నియమించింది. ప్రస్తుతం టెక్ మహీంద్రా ఎండీగా కొనసాగుతున్న సీపీ గుర్నానీ (CP Gurnani) ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విమరణ చేయనున్నారు.
ఆయన స్థానంలో మోహిత్ జోషి బాధ్యతలు స్వీకరిస్తారని టెక్ మహీంద్రా తెలిపింది. అంతకు ముందే ఆయన టెక్ కంపెనీలో చేరుతాడని, తద్వారా మార్పునకు అనుగుణంగా ఆయనకు సమయం దొరుకుతుందని పేర్కొంది. మోహిత్ జోషి మార్చి 11 నుంచి అంటే నేటి నుంచి ఇన్ఫోసిస్లో సెలవులో ఉండగా.. ఈ ఏడాది జూన్ 9 వరకు కంపెనీలో కొనసాగనున్నారు. మోహిత్ ఇన్ఫోసిస్లో ఇప్పటి వరకు యూరప్లో కంపెనీకి సంబంధించి ఫైనాన్షియల్ సర్వీసెస్ బిజినెస్ను లీడ్ చేశారు. 2007లో మెక్సికోలోని ఇన్ఫోసిస్కు సీఈవోగా చేరారు.
ఆయన అవీవాలోని కంపెనీకి నాన్ ఎగ్జిక్యూటివ్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తించారు. రిస్క్ అండ్ గవర్నెన్స్ అండ్ నామినేషన్ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. మోహిత్ జోషి 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్కు ఆహ్వానితుడిగా వెళ్లారు. బ్రిటిష్ ఇండస్ట్రీ ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ ఆఫ్ కాన్ఫెడరేషన్ వైస్ చైర్, యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఢిల్లీ యూనివర్సిలీలో ఎంబీఏ చేసిన జోషి గతంలో ఏఎన్జెడ్ గ్రైండ్లేస్, ఏబీఎన్ ఏఎంఆర్ఓ వారి కార్పొరేట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లోనూ సేవలందించారు.