Infosys | కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోంతో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రతిభావంతులైన నిపుణుల కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా 55 వేల మందికి పైగా బీటెక్ విద్యార్థులను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ చెప్పారు. టెక్ రంగంలో ఇంజినీరింగ్, సైన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేట్లకు అద్భుతమైన అవకాశాలున్నాయన్నారు. అయితే, వారు తక్కువ కాలంలో నూతన నైపుణ్యాలు ( new skills ) నేర్చుకుంటే కెరీర్ బాగుంటుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 55వేల మందిని నియమించుకుంటాం. వచ్చే ఏడాది ఇంత కంటే ఎక్కువ మందిని నియమించుకోనున్నాం అని బుధవారం నాస్కాం నిర్వహించిన సమావేశంలో సలీల్ పరేఖ్ మాట్లాడుతూ చెప్పారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వార్షిక రెవెన్యూ 20 శాతం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సలీల్ పరేఖ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ కంపెనీలో చేరి వృద్ధి సాధించేందుకు ప్రెషర్స్కు చాలా మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. నిపుణులకు భారీ స్థాయిలో నైపుణ్య శిక్షణ ఇవ్వడంపైనే కంపెనీ దృష్టి సారించిందన్నారు. ఫ్రెషర్స్కు ఆరు నుంచి 12 వారాల పాటు శిక్షణ ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ రీ స్కిలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని సలీల్ పరేఖ్ పేర్కొన్నారు. తమ క్లయింట్లు భారీ స్థాయిలో డిజిటల్ పరివర్తన దిశగా అడుగులేస్తున్నారని, ఆ దిశగా వెండర్లు, క్లయింట్లు, ఇతర భాగస్వాములతో, వాటాదారులతో కలిసి పని చేస్తుందన్నారు. ప్రాథమికంగా క్లౌడ్ చుట్టూ ఐటీ సేవలు తిరుగుతాయన్నారు. నైపుణ్యం గల ఉద్యోగుల భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని తెలిపారు.