న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల తగ్గుదలతో ప్రపంచవ్యాప్తంగా క్రమంగా సాధారణ పరిస్ధితులు నెలకొంటుండగా కంపెనీలు తిరిగి తమ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి. వర్క్ ఫ్రం హోంకు అలవాటు పడిన ఉద్యోగులు భారంగా కార్యాలయాలకు కదులుతున్నారు. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకూ వర్క్ ఫ్రం హోం పద్ధతికి స్వస్తి పలుకుతున్నాయి.
ఇక వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్) పద్ధతికి కొందరు మద్దతు పలుకుతుండగా మరి కొందరు డబ్ల్యూఎఫ్హెచ్తో ఇబ్బందులు ఏకరువు పెడుతున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి ఇంటి నుంచి పని చేసే పద్ధతి భారత్కు సరిపడదని పేర్కొన్నారు. తాను డబ్ల్యూఎఫ్హెచ్కు అనుకూలం కాదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుంటే సంస్ధాగత సంస్క్రతి క్రమంగా బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి పనిచేసే సంస్క్రతి ద్వారా కష్టించి పనిచేయడం, సృజనాత్మకత, నైపుణ్యం, ప్రతిభను వెలికితీయడం, సంప్రదింపులు వంటి అంశాల్లో మెరుగుదల సాధించడం కష్టమని అన్నారు.
భారత్ వంటి పేలవమైన ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ కలిగిన దేశాల్లో చాలామందికి హోం ఆఫీస్ను ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రూం వంటివి ఉండదని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో భారత ఉత్పాదకత బంగ్లాదేశ్ కంటే తక్కువగా ఉందని గుర్తుచేశారు. కార్పొరేట్లు ఉత్పాదకత పెంచుకునేందుకు తిరిగి కార్యాలయాల బాట పట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయంలో చైనాను అధిగమించాలంటే భారత్ వంటి దేశాలకు ఇది కీలకమని వ్యాఖ్యానించారు. ఇక నారాయణమూర్తి ప్రకటనపై సోషల్ మీడియాలో యూజర్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది.