Infosys | చెన్నై, సెప్టెంబర్ 28: దేశీయ రెండో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ ఇన్ఫోసిస్కు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అధికారుల నుంచి రూ.37.3 లక్షల డిమాండ్ నోటీసులు అందాయి. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) రూ.26.5 లక్షలు చెల్లించాలని, మరో రూ.2.65 లక్షలు జరిమానాగా, రూ.8.58 లక్షలు వడ్డీగా కట్టాలని కూడా సదరు వాణిజ్య పన్నుల శాఖ బుధవారం పంపిన నోటీసుల్లో ఉన్నది.
ఈ మేరకు చెన్నైలోని కేలంబాక్కమ్ అసెస్మెంట్ సర్కిల్ అసిస్టెంట్ కమిషనర్ నుంచి నోటీసులు వచ్చినట్టు గురువారం ఇన్ఫీ తెలియజేసింది. కాగా, 2021 అక్టోబర్-నవంబర్ ఎగుమతుల ఫారిన్ ఇన్వర్డ్ రెమిటెన్సెస్ నాన్-రిసిప్ట్లకు సంబంధించి ఈ నోటీసులు అందినట్టు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)కు సంస్థ తెలిపింది. అయితే ఈ నోటీసులు తమ సంస్థ ఆర్థిక పరిస్థితులను, నిర్వహణను, ఇతరత్రా కార్యకలాపాలను ఏ రకంగానూ ప్రభావితం చేయబోవని ఇన్ఫోసిస్ ఈ సందర్భంగా పేర్కొన్నది. అయినప్పటికీ గురువారం ట్రేడింగ్లో ఇన్ఫోసిస్ షేర్ విలువ బీఎస్ఈలో 1.91 శాతం పడిపోయింది.