న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: దేశంలోని గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) ఈ ఏడాది ఆగస్టు నెలలో రూ. 1,028 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించాయి. ఇంత జోరుగా మదుపరులు గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి డబ్బు తరలించడం 2022 ఆగస్టు తర్వాత ఇదే ప్రధమమని అసోసియేషన్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జూలైలో వీటిలోకి రూ.456 కోట్లు వచ్చాయి.
భౌతిక బంగారాన్ని ప్రతిబింబించే యానిట్లను గోల్డ్ ఈటీఎఫ్లుగా పరిగణిస్తారు. డీమ్యాట్ రూపంలో ఉండే ఇవి స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యి, బంగారం ధరకు అనుగుణంగా ట్రేడవుతాయి. ఒక యూనిట్ ఒక గ్రాము బంగారంతో సమానం.