న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలో ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గకపోవచ్చని, రాబోయే నెలల్లో ఇంకా పెరిగేందుకే అవకాశాలున్నాయని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్స్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్అండ్పీ) తెలిపింది. మంగళవారం ‘మంథ్లీ ఆసియా-పసిఫిక్ క్రెడిట్ ఫోకస్’పై వెబినార్ జరిగింది. ఈ సందర్భంగా ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఎకానమిస్ట్ (ఆసియా-పసిఫిక్) విశ్రుత్ రాణా మాట్లాడుతూ.. భారత్లో రుతు పవనాల కదలికలు చాలాచాలా మందగమనంతో ఉన్నాయన్నారు. ఈ సీజన్లో ఇప్పటిదాకా కురిసిన వర్షపాతం దాదాపు 11 శాతమేనని, ఇది సాధారణం కంటే తక్కువేనని పేర్కొన్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఈ వర్షాకాలం నిరాశపర్చినట్టేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ద్రవ్యోల్బణం ఇప్పట్లో తగ్గకపోవచ్చని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా పడకపోతే ధరాఘాతం తీవ్రంగానే ఉంటుందని ఈ సందర్భంగా రాణా హెచ్చరించారు. ఆశించిన స్థాయిలో వానలు కురవకపోతే.. వ్యవసాయం సజావుగా సాగదని, నీరు లేక పంట దిగుబడులు తగ్గిపోతాయని, దీంతో డిమాండ్కు తగ్గ ఆహారోత్పత్తులు మార్కెట్లో దొరకక.. ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని చెప్పారు. ఇప్పటికే ఆయా రకాల పప్పుధాన్యాల ధరలు రిటైల్, హోల్సేల్ మార్కెట్లలో బాగా పెరిగిపోయాయన్న విషయాన్ని గుర్తుచేశారు. రాబోయే నెలల్లో ఇంకా పెరుగవచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాబట్టి వర్షాలపైనే అంతా ఆధారపడి ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు పలుచోట్ల అతివృష్టి సంభవిస్తుండటంతో పంటలు మునిగిపోతున్నాయి. ఈ పరిస్థితులు కూడా ధరల పెరుగుదలకే కారణమవుతున్నాయి.
దేశంలో ఇప్పటికే ధరల మోత మోగుతున్న విషయం తెలిసిందే. వారం, పది రోజుల కిందటిదాకా కిలో టమాట ధర రూ.100-150 పలికిన సంగతీ విదితమే. అంతకుముందైతే మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కిలో రూ.250 వరకూ అమ్ముడుపోయింది. ఇతర కూరగాయలు, పప్పులు, గుడ్లు, మాంసాహారం, పాలు-పెరుగు ఇలా అన్నింటి ధరలూ కొండెక్కాయి. దీంతో ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకరంగానే నమోదవుతున్నది. జూలైలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 15 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 7.44 శాతానికి చేరింది. దీనికి ఆహారోత్పత్తుల ధరల్లో పెరుగుదలే కారణం కావడం గమనార్హం.
మార్కెట్లోకి సరఫరా పెరిగితేనే ధరలు శాంతిస్తాయని రాణా అన్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గోధుమలు, బియ్యం ధరలను అదుపు చేయకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధినే ప్రభావితం చేయవచ్చన్నారు. దేశంలో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా పలు చర్యలను తీసుకుంటున్నది తెలిసిందే. కీలక వడ్డీరేట్లను పెంచడం, ఇతర పాలసీపరమైన కఠిన విధానాలను అమలుపర్చడం చేస్తున్నది. అయినప్పటికీ ధరలు పెరుగుతూనే ఉండటం ఆందోళనకరంగా ఉన్నది.