న్యూఢిల్లీ, ఆగస్టు 19: దేశంలో పడగెత్తిన ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సిందేనంటూ రిజర్వ్బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యులు ముక్తకంఠంతో చెప్పారు. ఆగస్టు 3-5 తేదీల మధ్య జరిగిన ఎంపీసీ సమావేశపు మినిట్స్ను శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కానంత గరిష్ఠ స్థాయిలో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అంటూ 50 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపును ఆ సమావేశంలో ప్రతిపాదించారు. ఎంపీసీలో ఇతర సభ్యులు సైతం ఇవే అభిప్రాయాల్ని వ్యక్తం చేయడంతో రెపో రేటును అరశాతం పెంచి 5.40 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.7 శాతం మేర ఉంటుందని తాజా సమీక్షలో ఆర్బీఐ ప్రకటించిన విషయమూ విదితమే. ఆర్బీఐ సహనస్థాయి 6 శాతాన్ని మించి వరుసగా ఆరు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం వృద్ధి చెందుతున్నది. టోకు ద్రవ్యోల్బణమైతే 15 నెలల నుంచి రెండంకెల్లో కొనసాగుతున్నది.
ఆర్బీఐ ఎంపీసీ సమావేశపు వివరాలు..
22 నుంచి గోల్డ్ బాండ్ ఇష్యూధర గ్రాముకు రూ.5,197
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ తదు ఇష్యూ ఈ నెల22 నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజులపాటు 26 వరకూ ఇది అమలులో ఉంటుంది. ఈ ఇష్యూకు ధరను గ్రాముకు రూ. 5,197గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. ఈ బాండ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసేవారికి, డిజిటల్ రూపంలో చెల్లింపులు జరిపేవారికి గ్రాముకు రూ.50 చొప్పున డిస్కౌంట్ను కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నది. ఈ విధంగా కొనుగోలు చేసేవారికి గోల్డ్ బాండ్ ధర రూ.5,147 ఉంటుంది. కేంద్రం తరపున ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్లను జారీచేస్తున్నది. బ్యాంక్లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్, ఎంపికచేసిన పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజీల్లో ఇవి లభిస్తాయి. బాండు కాలపరిమితి 8 ఏండ్లుకాగా, ఐదేండ్ల తర్వాత బాండ్ను సమర్పించి పెట్టుబడిని వెనక్కు తీసుకునే వీలుంది.
ఫారెక్స్ రిజర్వులు డౌన్
విదేశీ మారకం నిల్వలు మరింత పడిపోయాయి. ఈ నెల 12తో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వులు 2.238 బిలియన్ డాలర్లు కరిగిపోయి 570.74 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. రిజర్వు బ్యాంక్ తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. విదేశీ మారకం రూపంలో ఉన్న ఆస్తుల విలువ 2.652 బిలియన్ డాలర్లు కరిగిపోవడం వల్లనే రిజర్వులు తగ్గుముఖం పట్టాయని ఆర్బీఐ తెలిపింది. కానీ, పసిడి రిజర్వులు మాత్రం 305 మిలియన్ డాలర్లు పెరిగి 40.618 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.