Retirement Investments | రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నప్పుడు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిశీలించడం చాలాచాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆయా వస్తూత్పత్తులు, సేవల ధరల్లో చోటుచేసుకునే పెరుగుదలనే ఈ ద్రవ్యోల్బణం సూచిస్తుంది. ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా రిటైర్మెంట్ పెట్టుబడులు పెట్టినైట్టెతే ఆ వచ్చే సొమ్ము పెరిగిన ధరలకే పోతుంది తప్ప.. మీ అవసరాలకు మాత్రం చాలదు. దీనివల్ల మీ పదవీ విరమణ అనంతరం జీవితం కూడా ఆశించిన స్థాయిలో ఆనందంగా ఉండదు. అందుకే ఇప్పటి ద్రవ్యోల్బణం స్థాయి, అప్పటి ద్రవ్యోల్బణం లెక్కల్ని అంచనా వేసి, దానికి తగ్గట్టుగానే పెట్టుబడులకు వెళ్తే లాభదాయకం.
రిటైర్మెంట్ సేవింగ్స్పై ద్రవ్యోల్బణం ప్రభావం నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువే. ఎంతోమంది వృద్ధులు వారి పెన్షన్, రిటైర్మెంట్ ఫండ్స్పైనే ఆధారపడి జీవిస్తూంటారు. అయితే పెరిగే ధరలు వారి రిటైర్మెంట్ సేవింగ్స్ వాస్తవ విలువ క్షీణతకు దారితీస్తాయి. దేశంలో ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గులు.. సాధారణ వ్యక్తులు, వేతన జీవులనే అధికంగా ప్రభావితం చేస్తుంటాయి. పదవీ విరమణ అనంతరం పెన్షన్ ఆదాయంపై జీవించేవారికీ ద్రవ్యోల్బణం కష్టాలు తప్పవు. అందువల్ల కాబట్టి ముందుగానే ద్రవ్యోల్బణం అంచనాలతో పెట్టుబడులకు దిగితే ఆ ఇబ్బందులను వృద్ధాప్యంలో అధిగమించవచ్చు. లేకపోతే చాలీచాలని ఆదాయంతో సమస్యల్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది.
రిటైర్మెంట్ సేవింగ్స్ను ద్రవ్యోల్బణం ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం. ఉదాహరణకు.. నేడు మీ ఖర్చులు రూ.5,000 లుగా ఉన్నాయి. అయితే 6 శాతం ద్రవ్యోల్బణం ప్రభావంతో భవిష్యత్తులో ఈ ఖర్చు రూ.5,300లకు పెరిగిందనుకుంటే, వచ్చే 30 ఏండ్లలో.. అది దాదాపు రూ.28,700లను తాకగలదు. దీన్నిబట్టి ఒక్కసారి ఆలోచించండి.. మీరు ఈరోజు బాగానే పొదుపు చేస్తున్నామనుకుంటున్న మొత్తాలు, అప్పటికి ఎంతమేరకు మీ ఖర్చుల్ని భరించగలవోనని.
ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి మీ రిటైర్మెంట్ ఫండ్స్ రక్షణకు ఈ విధంగా ప్రయత్నించవచ్చని కొందరు నిపుణులు సలహా ఇస్తున్నారు. వాటి ప్రకారం..
ద్రవ్యోల్బణాన్ని మించి ఆకర్షణీయ రాబడులను అందుకోవాలంటే.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులను పరిశీలించడం ఉత్తమం. దీర్ఘకాలంలో పెద్ద ఎత్తున ఆదాయం లేదా లాభాలను పొందాలంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ సరి అని చెప్పవచ్చు. నిజానికి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. అయితే షార్ట్-టర్మ్ ఇన్వెస్టర్లకే ఈ రిస్క్ ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. రోజూ చూస్తున్న ఒడిదొడుకులు వీరినే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. లాంగ్-టర్మ్ ఇన్వెస్టర్లకు ఇది తక్కువే. అందుకే స్వల్పకాల లక్ష్యాలతో ఈక్విటీల్లో పెట్టుబడులకు దిగవద్దు. అందుకు భిన్నంగా ముందుకెళ్తే.. ద్రవ్యోల్బణాన్ని మేనేజ్ చేసే ఆకర్షణీయ రిటర్న్స్ను సొంతం చేసుకోవచ్చు. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకున్నైట్టెతే మరింతగా సత్ఫలితాలుంటాయి.
పెట్టుబడుల వర్గీకరణ వాటికున్న రిస్కుల్ని తగ్గించగలదు. అందుకే మీ పోర్ట్ఫోలియోలో రకరకాల పెట్టుబడి సాధనాలను చేర్చుకోండి. నిపుణుల సూచనల ప్రకారం.. స్టాక్స్లో 30 శాతం, బాండ్లలో 30 శాతం, రియల్ ఎస్టేట్లో 30 శాతం, నగదు-బంగారంపై మిగతా 10 శాతం పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటుంది. ఇలా చేస్తే ఆయా రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చు. ఒకట్రెండు రంగాల్లో నష్టాలు వాటిల్లినా.. మిగతా రంగాల్లోని లాభాలతో వాటిని భర్తీ చేసుకోవచ్చు. ముఖ్యంగా అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఈ పెట్టుబడులు కలిసొస్తాయి. అందుకే ఒకే రంగంపై దృష్టి పెడుతూ అందులోనే మొత్తం సొమ్మును పెట్టుబడిగా పెడితే పెద్దగా వృద్ధికి ఆస్కారం ఉండదు. పైగా సదరు రంగం కుదేలైతే మనమూ మునిగిపోతాం.
ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నప్పుడు స్వల్ప కాలంలో మంచి రాబడులను అందుకోవడానికి ఈ ఫండ్లు చక్కగా దోహదం చేయగలవు. సాధారణంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే, వడ్డీరేట్లూ ఎక్కువగానే ఉంటాయి. ధరల్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును పెంచేస్తుంది. దీనివల్ల బ్యాంకుల రుణాలపై వడ్డీరేట్లూ పెరుగుతాయి. ఈ నేపథ్యంలోనే ఫ్లోటింగ్-రేట్ బాండ్లు, ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్లు లాభదాయకం. కాబట్టి ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదవుతున్నప్పుడు ఈ ఫండ్లలో ఇన్వెస్ట్మెంట్లకు దిగితే అదనపు ఆదాయం అందుకోవచ్చు.
ధరలు పెరుగుతున్నప్పుడు రోజువారీ అవసరాల కోసం పెట్టే ఖర్చులూ పెరుగుతూపోతుంటాయి. దీనివల్ల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతూ ఉంటుంది. కనుక ప్రతీ నెలా ఖర్చులు ఏవి? అన్నదానిపై స్పష్టత ఉంచుకుంటే ఎక్కడ అదనపు ఖర్చులుంటున్నాయో గుర్తించవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల ద్వారా కూడా పెట్టుబడులకు దిగి స్టాక్ మార్కెట్లో ప్రవేశించవచ్చు. సురక్షితమైన పెట్టుబడుల కోసం ఎఫ్డీ, ప్రభుత్వ పథకాలు బెటర్. పోస్టాఫీస్ స్కీములూ లాభదాయకమే. ఐటీ మినహాయింపులూ ఉంటాయి.