హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక ఇంధనం) లక్ష్యాలను చేరుకోడానికి అమెరికా, భారత్ పరస్పర సహకారంతో ముందుకెళ్తాయని యూఎస్ కాన్సులేట్ జనరల్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ అన్నారు. యూఎస్ కాన్సుల్ జనరల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ‘అడ్వాన్సింగ్ ఇండో-యూఎస్ కొలాబరేషన్’లో భాగంగా హైదరాబాద్లో రెన్యువబుల్ ఎనర్జీ స్పీకర్ సిరీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మోయర్ మాట్లాడుతూ.. ఇరు దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోని నిపుణులను ఏకం చేసి, వారి ఆలోచనల ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు కృషి జరుగుతుందన్నారు. సీఐఐ తెలంగాణ స్టేట్ ఆఫీస్ చైర్మన్ వాగీష్ దీక్షిత్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక అవగాహనకు, ఇండో-యూఎస్ సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.
తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డీవీ రామకృష్ణ మాట్లాడుతూ.. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం ముందుందని, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాలను విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.