న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఇండిగో ఎయిర్లైన్స్ ప్రమోటర్లలో ఒకటైన గంగ్వాల్ కుటుంబం కొంత వాటా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. స్టాక్ మార్కెట్లో ఆగస్టు 16న బ్లాక్డీల్ ద్వారా రూ.3,730 కోట్ల విలువైన షేర్లను గంగ్వాల్ కుటుంబం ఆఫ్లోడ్ చేస్తుందని ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. షేరుకు రూ.2,400 ధరతో 1.56 కోట్ల షేర్లను విక్రయిస్తారు. అమ్మకపు ధర సోమవారం ముగింపుధరకంటే 5.8 శాతం తక్కువ.
మోర్గాన్స్టాన్లీ, గోల్డ్మాన్ శాక్స్, జేపీ మోర్గాన్లు ఈ డీల్ను నిర్వహించనున్నాయి. ఇండిగోలో గంగ్వాల్ కుటుంబానికి 29.72 శాతం ఉంది. గంగ్వాల్తో పాటు ఇతర ప్రమోటర్లకు మొత్తం 67.77 శాతం వాటా ఉంది. 2022 ఫిబ్రవరిలోనే కంపెనీ బోర్డు నుంచి వైదొలిగిన గంగ్వాల్ తమ వాటాను ఐదేండ్లలో పూర్తిగా విక్రయిస్తామని అప్పట్లోనే ప్రకటించారు.