విమాన ఇంధన ధరల ప్రభావం
న్యూఢిల్లీ, మే 25: ఇండిగో విమానాల్ని నడిపే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఆర్థిక ఫలితాల్ని అధిక ఇంధన ధరలు దెబ్బతీసాయి. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఈ సంస్థ నికరలాభం భారీగా రూ. 1,682 కోట్లకు పెరిగిపోయింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ నష్టం రూ. 1,142 కోట్లు. సంస్థ ఆదాయం మాత్రం రూ.6,223 కోట్ల నుంచి 29 శాతం వృద్ధిచెంది రూ. 8,021 కోట్లకు చేరింది. విమాన ఇంధన ధరల పెరుగుదలతో తమ ఇంధన వ్యయం ఏకంగా 68 శాతం పెరిగి రూ. 3,221 కోట్లకు పెరిగిందని, మొత్తంగా వ్యయాలు 32 శాతం ఎగసి రూ. 9,885 కోట్లకు చేరినట్టు కంపెనీ బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఆపరేటింగ్ లాభాల మార్జిన్లు 10.4 శాతం నుంచి 2.1 శాతానికి తగ్గాయన్నది.
క్లిష్టమైన త్రైమాసికం
గడిచిన మార్చి త్రైమాసికం చాలా క్లిష్టమైనదని, ప్రధమార్థంలో ఒమిక్రాన్ వైరస్తో విమాన సర్వీసులకు డిమాండ్ దెబ్బతిన్నదని, ద్వితీయార్థంలో ప్రయాణీకుల ట్రాఫిక్ గణనీయంగా పెరిగినప్పటికీ, అధిక ఇంధన ధరలు, రూపాయి విలువ క్షీణతలతో సవాళ్లు ఎదుర్కొన్నామని ఇండిగో సీఈవో రొనొజోయ్ దత్తా చెప్పారు. కోలుకుంటున్న మార్కెట్లో ఆదాయాన్ని గరిష్ఠపర్చుకునేందుకు ఇండిగో సంసిద్ధమై ఉందని, సంస్థను తిరిగి లాభాలబాట పట్టించేందుకు కట్టుబడ్డామని వివరించారు. ముగిసిన క్వార్టర్లో గరిష్ఠంగా 1,577 డెయిలీ ఫ్లయిట్స్ను నడిపామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తమ సామర్థ్యం 150 శాతం మేర పెరుగుతుందని, పూర్తి ఏడాదిలో 55-60 శాతం పెరగవచ్చన్నారు.