న్యూఢిల్లీ, అక్టోబర్ 5: విమాన ప్రయణికులపై ఏటీఎఫ్ పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏటీఎఫ్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు ఇంధన చార్జ్ విధించడానికి సిద్ధమవుతున్నాయి. వీటిలో దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో ఏకంగా రూ.1,000 వరకు విధించబోతున్నట్టు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ రూట్లలో కిలోమీటర్ల దూరాన్ని బట్టి చార్జి వసూలు చేస్తున్నది. 500 కిలోమీటర్ల వరకు రూ.300 వసూలు చేస్తున్న సంస్థ..గరిష్ఠంగా 3,500 కిలోమీటర్లకు పైగా దూరాన్ని రూ.1,000 విధిస్తున్నది. ఈ చార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి వస్తున్నాయని పేర్కొంది. సంస్థల నిర్వహణలో సగానికి పైగా ఇంధన కోసం ఖర్చు చేస్తుండటంతో ఆయా సంస్థలపై అధికభారం పడుతున్నది.
విమాన ఇంధన ధర భారీగా పెంచుతున్నాయి ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలు. దేశ రాజధాని ఢిల్లీలో విమాన ఇంధన ధర కిలో లీటర్ ధర రూ.5,779.84 లేదా 5.1 శాతం పెంచింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ). దీంతో కిలో లీటర్ ధర రూ.1,13,419.33 నుంచి రూ.1,18,199.17కి చేరుకున్నది. ఆగస్టు 1న కిలో లీటర్ ధర 8.5 శాతం(రూ.7,728.38), సెప్టెంబర్ 1న 14.1 శాతం(రూ.13,911.07) పెంచిన సంస్థలు..ఈ నెల మొదట్లో 5 శాతం వడ్డీంచాయి. ఇలా వరుసగా ధరలు పెంచడం ఇది నాలుగోసారి కావడం విశేషం.