న్యూఢిల్లీ, ఆగస్టు 13:దేశీయ స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. రోజు రోజుకొక రికార్డులు బద్దలు కొడుతున్న సెన్సెక్స్ శుక్రవారం మరో మైలురాయిని అధిగమించింది. ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఇతర రంగాల షేర్ల నుంచి లభించిన మద్దతుతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 55 వేల పాయింట్లను అధిగమించి నూతన శిఖరాలకు చేరుకున్నది. హెవీవెయిట్ షేర్లు అద్భుతమైన ర్యాలీ జరపడంతో వారాంతం ట్రేడింగ్లో స్టాక్ సూచీలు కొనుగోళ్ళలో కళకళలాడాయి. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 55,000 పాయింట్ల స్థాయిని దాటింది. ఈ సూచి 593 పాయింట్ల భారీలాభంతో 55,437 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్తోపాటు జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఇదే బాటలో చరిత్రలో ప్రప్రధమంగా 16,500 పాయింట్ల స్థాయిని అధిగమించింది. ఇది 165 పాయింట్ల లాభంతో 16,529 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,160 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్ల చొప్పున పెరిగాయి. ఐటీ షేర్లకు జోరుగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నాయి. రంగాలవారీగా టెలికాం, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, ఎనర్జీ, కన్జూమర్ డ్యూరబుల్స్ సూచీలు 1.8 శాతం వరకూ పెరిగాయి. రియల్టీ, హెల్త్కేర్ సూచీలు మాత్రం నష్టాలతో ముగిసాయి. అలాగే మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు&లార్జ్క్యాప్ షేర్లతో పోలిస్తే వెనుకపడ్డాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలు స్వల్పంగా తగ్గాయి. వరుసగా రెండు నెలలుగా గరిష్ఠ స్థాయిలో దూసుకుపోయిన ద్రవ్యోల్బణం తిరిగి తగ్గుముఖం పట్టడం, పారిశ్రామిక రంగం మళ్లీ జెట్ స్పీడ్ వేగంతో కోలుకోవడం మదుపరులకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చాయి.
ఈ షేర్లదీ రికార్డే
సూచీలే కాదు..టీసీఎస్, టాటా స్టీల్, ఎల్ అండ్ టీ, భారతి ఎయిర్టెల్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్లు కూడా నూతన గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా టీసీఎస్ 3.22 శాతం పెరిగింది. లాభపడిన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీలు కూడా ఉన్నాయి.
ఐటీ రంగం రెండంకెల వృద్ధిసాధించే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తుండటం, డిజిటలైషన్ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీ ఆర్డర్లను సంపాదించడంతో ఈ వారమంతా ఇన్వెస్టర్లు ఈ షేర్లపై దృష్టిపెట్టారు.
-బినోద్ మోది, స్ట్రాటజీ హెడ్, రిలయన్స్ సెక్యూరిటీస్
రూ.3.48 లక్షల కోట్లు పెరిగిన సంపద
స్టాక్ మార్కెట్లు ర్యాలీతో మదుపరులు లాభాల జడివానలో తడిసిముద్దయ్యారు. కరోనా వైరస్తో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరిపారు. ఫలితంగా వరుసగా రెండు రోజుల్లో మదుపరుల సంపద రూ.3.48 లక్షల కోట్ల మేర పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే రూ.1.35 లక్షల కోట్లు సంపద పెరుగడం గమనార్హం. దీంతో బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2,40,23,280 కోట్లకు పెరిగింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇది కూడా రికార్డు.