న్యూఢిల్లీ, జూలై 7: మొబైల్ ఫోన్ వినియోగదారులకు మరోసారి చార్జీల మోత మోగనున్నది. ఎకనామిక్ టైమ్స్ (ఈటీ) టెలికం నివేదిక ప్రకారం.. దేశీయ టెలికం కంపెనీలైన భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియాలు ఈ ఏడాది ఆఖరుకల్లా ప్లాన్ల ధరల్ని 10 నుంచి 12 శాతం పెంచాలని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే కస్టమర్లపై చార్జీల భారం ఆయా ప్లాన్లు, వాటి కాలపరిమితి, రోజువారీ డాటానుబట్టి గరిష్ఠంగా రూ.500 వరకు పడటం ఖాయం.
ఏడాది క్రితం జూలైలోనే భారతీయ టెలికం సంస్థలు తమ మొబైల్ ఫోన్ ప్లాన్ల ధరల్ని 11 నుంచి 23 శాతం వరకు పెంచాయి. దీంతో ప్లాన్ వ్యవధి, దాని డాటా, ఇతరత్రా ఆఫర్లనుబట్టి గరిష్ఠంగా రూ.900 వరకు ధరలు పెరగడం గమనార్హం. నిజానికి పాపులర్ ప్లాన్ల ధరలు ఇప్పటికే రూ.200కుపైగా పెరగడంతో మొబైల్ ఫోన్ యూజర్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో మళ్లీ భారీ ఎత్తునే చార్జీల పెంపునకు వీలుందన్న వార్తలు.. కస్టమర్లకు గుబులు పుట్టిస్తున్నాయి. సహజంగా మార్కెట్లో 3 నెలల ప్లాన్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి. దీంతో డిసెంబర్కల్లా వాటి ధరలు ఇంకో రూ.70-85 మేర పెరిగే వీలున్నది.
ఈ ఏడాది మే నెలలో టెలికం సంస్థల యాక్టివ్ సబ్స్ర్కైబర్లు భారీగా పెరిగారు. ఈ నేపథ్యంలోనే రిచార్జ్ ధరల్ని టెల్కోలు పెంచాలని భావిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే ధరలు పెంచితే మరో టెలికం నెట్వర్క్లోకి తమ వినియోగదారులు వెళ్లకుండా టెలికం సంస్థలు ఓ నిర్ధిష్ట విధానంపైనా దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా ప్లాన్లపై ఆకర్షణీయ ఆఫర్లు వచ్చే వీలుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి కస్టమర్లు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు వెళ్లిపోతుంటే కంపెనీలు చార్జీల పెంపునకు వెనుకాడుతాయి. అలాకాకుండా ఒకే సంస్థలో కొనసాగుతున్నైట్టెతే ధరల మోతకు సాహసిస్తాయి. ఇప్పుడిదే వాతావరణం పరిశ్రమలో కనిపిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రస్తుతం దేశంలో 100 కోట్లకుపైగానే టెలికం వినియోగదారులున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.