SBI Investment | దేశంలోని లీడింగ్ మర్చంట్ కామర్స్ ప్లాట్ఫామ్ పైన్ ల్యాబ్స్లో అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ 20 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నది. తమ సంస్థలో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ పెట్టుబడులు పెట్టినందుకు సంతోషిస్తున్నామని పైన్ ల్యాబ్స్ సీఈవో బీ అమ్రిష్ రావు తెలిపారు. ఆఫ్లైన్లోనూ, ఆన్లైన్లోనూ నిరంతరాయంగా, సురక్షితంగా పేమెంట్స్ లావాదేవీలతో మర్చంట్స్కు సాధికారత కల్పించేందుకు సాగుతున్న తమ ప్రయాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఎస్బీఐని ఆహ్వానిస్తున్నామన్నారు.
భారత్తోపాటు ఆగ్నేయాసియా రీజియన్ పరిధిలో బై నౌ పే ల్యాటర్ (బీపీఎన్ఎల్) బిజినెస్ను పైన్ ల్యాబ్స్ కూడా విస్తరిస్తున్నది. ఆగ్నేయాసియా రీజియన్లోనే అతిపెద్ద కన్జూమర్ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ ఫేవ్ సంస్థను గత ఏడాది ఏప్రిల్లో టేకోవర్ చేసింది. 2019లో క్విక్కల్వర్ను టేకోవర్తో గిఫ్ట్, ప్రీపెయిడ్, స్టోర్డ్ వాల్యూ సెగ్మెంట్లోనూ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. గతేడాది పైన్ల్యాబ్స్ యాజమాన్యం న్యూ ఇన్వెస్టర్ల నుంచి 600 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను సేకరించింది. అమెరికా కేంద్రంగా పని చేస్తున్న ఇన్వెస్కో డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ 10 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టింది.
సిక్యోయా క్యాపిటల్, టేమాసెక్ హోల్డింగ్స్, యాక్టిస్, పేపాల్, మాస్టర్ కార్డ్ తదితర సంస్థలు పైన్ ల్యాబ్స్లో పెట్టుబడులు పెట్టాయి. వీటికి అదనంగా నూతనంగా ప్రారంభించిన ఆన్లైన్ పేమెంట్స్ ప్రొడక్స్ సంస్థ ప్లూరల్లో పెట్టుబడులు పెట్టనున్నది. భారత్పే, ఎంఎస్ వైప్, పేటీఎం, రాజోర్ పే వంటి ఇతర ఫిన్టెక్ సంస్థలతో పైన్ ల్యాబ్స్ పోటీ పడనున్నది.