గత ఏడాది దేశీయంగా పసిడి అమ్మకాలు 3 శాతం క్షీణించాయి. పెరుగుతున్న బంగారం ధరలే ఇందుకు కారణం. అయినప్పటికీ ఈ ఏడాది దేశంలోకి బంగారం దిగుమతులు డిమాండ్ను మించి జరుగవచ్చు. చాలా దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) కలిసొస్తాయనిపిస్తున్నది.
-సోమ సుందరం, డబ్ల్యూజీసీ ఇండియా ప్రాంతీయ సీఈవో
Gold | ముంబై, జనవరి 31: దేశంలో బంగారం గిరాకీ గత ఏడాది తగ్గుముఖం పట్టింది. 2022తో పోల్చితే 2023లో గోల్డ్ డిమాండ్ 3 శాతం పడిపోయినట్టు బుధవారం ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు 2023’ పేరిట విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదికలో స్పష్టమైంది. నిరుడు 747.5 టన్నులకే పరిమితమైనట్టు చెప్తున్నారు. అంతకుముందు ఏడాది 774.1 టన్నులుగా ఉన్నదని పేర్కొంటున్నారు. అధిక ధరలు, తీవ్ర ఒడిదొడుకులే ఇందుకు కారణమని డబ్ల్యూజీసీ అంటున్నది. కాగా, ధరలు స్థిరంగా ఉంటే ఈ ఏడాది 800-900 టన్నుల పసిడి అమ్ముడుపోగలదని మండలి ఈ సందర్భంగా అంచనా వేస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ డిమాండ్ నిరుడు 5 శాతం దిగజారి 4,448.4 టన్నులుగానే ఉన్నట్టు డబ్ల్యూజీసీ వెల్లడించింది. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ల నుంచి పెట్టుబడులు తరలిపోవడం ప్రభావితం చేసినట్టు చెప్తున్నది. అంతకుముందు రెండేండ్లలోనూ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగిందని డబ్ల్యూజీసీ గుర్తుచేస్తున్నది. ఇక 2013 నుంచి ఎన్నడూ లేనంతగా యూరప్లో డిమాండ్ క్షీణించిందని 180 టన్నులకు పతనమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి తెలియజేసింది. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంక్ల పసిడి కొనుగోళ్లూ నిరుడు 45 టన్నులు తగ్గి 1,037 టన్నులుగానే ఉన్నాయి. చైనా బ్యాంక్ మాత్రం 225 టన్నులతో ముందున్నది. అయితే అంతర్జాతీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఆందోళనలు, ఎన్నికల నడుమ మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తే.. ఈ ఏడాది డిమాండ్ పెరుగవచ్చన్న ఆశాభావాన్ని డబ్ల్యూజీసీ వ్యక్తం చేసింది.