న్యూఢిల్లీ, మే 31: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 4.1 శాతం మాత్రమే వృద్ధిచెందింది. అంతకుముందు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.4 శాతం కంటే ఈ జనవరి- మార్చిలో జీడీపీ వృద్ధి దిగజారినట్టు మంగళవారం జాతీయ గణాంకాల శాఖ (ఎన్ఎస్వో) విడుదల చేసిన డాటా వెల్లడిస్తున్నది. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువ ఆర్థికాభివృద్ధి నమోదైనది ఈ జనవరి- మార్చిలోనే. తొలి త్రైమాసికంలో 20.1 శాతం, రెండో త్రైమాసికంలో 8.4 శాతం చొప్పున వృద్ధిచెందింది.
2020-21 జనవరి-మార్చిలో ఇది 2.5 శాతం. అయితే 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8.7 శాతం వృద్ధిచెందినట్టు అంచనా. 2020-21లో కొవిడ్ ప్రబలిన కారణంగా ఆ ఏడాది ఆర్థిక వ్యవస్థ 6.6 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. అప్పటి లోయర్బేస్ ఫలితంగా మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అధికంగా కన్పిస్తున్నది. అయితే 2021-22లో వృద్ధి 8.9 శాతం ఉంటుందని, నాలుగో త్రైమాసికంలో 4.8 శాతం వృద్ధిచెందుతుందని గతంలో ఎన్ఎస్వో రెండో అడ్వాన్స్డ్ అంచనాల్లో ప్రకటించింది. ఈ అంచనాలకంటే తక్కువ రేటు నమోదుకావడం గమనార్హం. ఇక కొవిడ్ ముందస్తు సంవత్సరం 2019-20తో పోలిస్తే 2021-22లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి 1.5 శాతమే. ఈ ఏడాది జనవరి నెలలో ఒమిక్రాన్ వేవ్తో ఆంక్షలు, తదుపరి అంతర్జాతీయ సరఫరాల ఆటంకాలు, ముడి పదార్థాల ధరల పెరుగుదల క్యూ4 జీడీపీపై ప్రభావం చూపించినట్టు ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
మార్చి త్రైమాసికంలో వ్యవసాయ రంగం 4.1 శాతం వృద్ధిచెందగా, తయారీ రంగం 0.2 శాతం క్షీణించింది. మైనింగ్ రంగం 6.7 శాతం వృద్ధిచెందగా, రక్షణ, ఇతర సర్వీసులు 7.7 శాతం వృద్ధి సాధించాయి.
వాస్తవ జీడీపీ (2011-12 ధరల ప్రకారం) 2020-21లో రూ.135.58 లక్షల కోట్లుకాగా, 2021-22లో 147.36 లక్షల కోట్లకు చేరినట్టు ఎన్ఎస్వో తెలిపింది. గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 8.1 శాతం వృద్ధిచెందిందని పేర్కొంది. 2020-21లో ఇది 4.8 శాతం క్షీణించింది. ప్రస్తుత ధరల ప్రకారం నామినల్ జీడీపీ రూ.236.65 లక్షల కోట్లుగా ఎన్ఎస్వో అంచనా వేసింది. 2020-21లో ఇది రూ.198.01 లక్షల కోట్లు.
2011-12 బేస్ ధరల ప్రకారం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వార్షిక తలసరి ఆదాయం రూ.91,481. 2021 మార్చితో ముగిసిన సంవత్సరంలో నమోదైన రూ.85,110 నుంచి ఇది 7.5 శాతం వృద్ధిచెందింది. ప్రస్తుత ధరల ప్రకారం వార్షిక తలసరి ఆదాయంరూ.1,26,855 నుంచి రూ.1.5 లక్షలకు పెరిగింది.
క్యూ4లో జీడీపీ వృద్ధి మందగిం చడానికి ఒమిక్రాన్ వేవ్ కారణం. దేశంలో మాంద్య పరిస్థితులు వచ్చే అవకాశాలు లేవు. ఏప్రిల్ నెలకు జీఎస్టీ వసూళ్లను పరిశీలిస్తే ఆర్థిక కార్యకలాపాలు జోరందుకున్నట్టు కన్పిస్తున్నది. ఫైనాన్షియల్ రంగం గతంలోకంటే ఎంతో మెరుగ్గా ఉంది. విదేశీ వాణిజ్యం సైతం పుంజు కుంటోంది. కేంద్ర బ్యాంక్లు ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుండటం, కమోడిటీ ధరల పెరుగుదలే ప్రస్తుత సవాళ్లు. అంతర్జాతీయ రిస్క్లు తొలగినంతనే ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రైవేట్ రంగం దూకుడు ప్రదర్శిస్తుంది.
– అనంత్ నాగేశ్వరన్
జీడీపీ డాటా అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అంతర్జాతీయ అనిశ్చితి, అధిక చమురు ధరలతో భవిష్యత్ వృద్ధిపై సైతం మేఘాలు కమ్ముకున్నాయి. ఉపాధి కల్పన బలహీనంగా ఉండటం, ప్రభుత్వానికి అదనపు వ్యయ సామర్థ్యం పరిమితంకావడం, పెరుగుతున్న ముడి పదార్థాల ధరలతో కార్పొరేట్ల మార్జిన్లు తగ్గనుండటం ఆందోళనకారకాలు.
– ఉపాస్న భరద్వాజ్, సీనియర్ ఎకానమిస్ట్,కోటక్ మహీంద్రా బ్యాంక్