న్యూఢిల్లీ, నవంబర్ 15: అక్టోబర్ నెలలో భారత్ విదేశీ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. రెండేండ్ల తర్వాత తొలిసారిగా ఎగుమతులు క్షీణబాట పట్టాయి. మంగళవారం కేంద్ర వాణిజ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2022 అక్టోబర్ నెలలో నిరుడు ఇదే నెలతో పోలిస్తే ఎగుమతులు 16.65 శాతం పడిపోయి 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కీలక ఎగుమతి రంగాలైన జెమ్స్, జ్యువెల్లరీ, ఇంజనీరింగ్, పెట్రోలియ ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, ఫార్మా, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు ప్రతికూల వృద్ధిని కనపర్చాయి. ఇదే సమయంలో దిగుమతులు 6 శాతం వృద్ధితో 56.69 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ముడి చమురు, పత్తి, ఎరువులు, యంత్రాల దిగుమతులు అధికం కావడం ఇందుకు కారణం. ఒక వైపు ఎగుమతులు భారీగా క్షీణించడం, మరోవైపు దిగుమతులు పెరగడంతో వాణిజ్యలోటు అక్టోబర్లో 26.91 బిలియన్ డాలర్లకు చేరిపోయింది.
వినియోగం తగ్గడమే కారణం: వాణిజ్య కార్యదర్శి
ప్రపంచవ్యాప్తంగా వినియోగం తగ్గడమే భారత్ ఎగుమతుల్ని దెబ్బతీసిందని కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ భరత్వాల్ చెప్పారు. అమెరికా, యూఎస్లలో ద్రవ్య విధానం కఠినతరంకావడంతో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ దెబ్బతింటున్నదన్నారు. ట్రేడ్ డాటా విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 2022లో అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి 3.5 శాతం, 2023లో 1 శాతమే ఉంటుందని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) అంచనా వేసిందన్నారు. అంతర్జాతీయ వర్తకంలో భారత్ వాటా 1.8 శాతమని, గ్లోబల్ సర్వీసుల్లో ఈ వాటా 4 శాతమన్నారు. డబ్ల్యూటీవో అంచనాలతో మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ప్రపంచ వాణిజ్యంలో భారత్ వాటాను పెంచుకునేందుకు ఎంతో అవకాశం ఉందని సునీల్ వివరించారు.