ముంబై, ఆగస్టు 25: భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గాయి. ఆగస్టు 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 7.273 బిలియన్ డాలర్ల మేర క్షీణించి రూ. 594.888 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. ఒకేవారంలో ఇంతగా తగ్గడం ఆరు నెలల తర్వాత ఇదే ప్రథమం. అంతక్రితం వారం ఇవి 708 మిలియన్ డాలర్లు పెరిగి 602.161 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు డాలర్లను విక్రయించడంతో నిల్వలు తగ్గాయని ఫారెక్స్ నిపుణులు చెప్పారు.
కేంద్ర బ్యాంక్ డాలర్లను విక్రయించిన కారణంగా విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 6.613 బిలియన్ డాలర్ల మేర క్షీణించి 527.786 బిలియన్ డాలర్ల వద్దకు తగ్గాయి. గతవారం రూపాయి మారకపు విలువ ఆల్టైమ్ కనిష్ఠస్థాయి 82.30 వద్దకు పడిపోయిన సంగతి తెలిసిందే, ఆర్బీఐ జోక్యంతో ఈ వారం అది 82.60 స్థాయికి కోలుకుంది. డాలర్ విలువలో కలిగిన మార్పులతో పాటు ఆర్బీఐ వద్దనున్న యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీలకు డాలరు మారకంలో ఏర్పడిన తరుగుదల లేదా పెరుగుదలను సైతం ఈ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ నెల 18తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు 515 మిలియన్ డాలర్లు క్షీణించి 43,824 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్లు) 119 మిలియన్ డాలర్ల మేర తగ్గి 18.205 బిలియన్ డాలర్ల స్థాయికి పెరిగాయి. ఐఎంఎఫ్ వద్దనున్న నిల్వలు 25 మిలియన్ డాలర్ల వరకూ తగ్గి 5.072 బిలియన్ డాలర్లకు చేరాయి. 2021 అక్టోబర్లో నమోదైన 645 బిలియన్ డాలర్ల రికార్డుస్థాయిని మళ్లీ విదేశీ మారక నిల్వలు అందుకోలేకపోతున్నాయి.