హైదరాబాద్, ఏప్రిల్ 25: ప్రముఖ ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్కైరూట్ మరో రాకెట్ను అంతరిక్షంలోకి పంపించడానికి సిద్ధమైంది. పైలెట్ ప్రాజెక్టు కింద మూడేండ్ల క్రితం తన తొలి రాకెట్ విక్రమ్ను పంపించిన సంస్థ..వచ్చే రెండు నెలల్లో విక్రమ్-1 రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పంపించడానికి సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ లేదా జూలై నెలలో 350 కిలోల బరువు కలిగిన ఈ రాకెట్ను పంపించనున్నట్టు కంపెనీ కో-ఫౌండర్, సీఈవో పవన్ కుమార్ తెలిపారు. అంతరిక్షంలోకి ప్రైవేట్ సంస్థ పంపుతున్న తొలి దేశీయ రాకెట్ ఇదే కానున్నదన్నారు.
దీంతోపాటు 23-మీటర్ల పొడవైన రాకెట్ను వచ్చే కొన్నినెలల్లో అంతరిక్షంలోకి పంపించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో రాకెట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ ప్లాంట్ సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నట్టు, వచ్చే రెండేండ్లలో ఈ యూనిట్లో నెలకు ఒక్క రాకెట్ను తయారు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సంస్థలో వెయ్యికి మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.