న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ ఎగుమతులు గత నెల 26.49 శాతం పుంజుకున్నాయి. నవంబర్లో 29.88 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు బుధవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ అంచనాగా తెలిపింది. ఇంజినీరింగ్, పెట్రోలియం, రసాయనాలు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు ఆకర్షణీయ వృద్ధిని సాధించాయని పేర్కొన్నది. గతేడాది నవంబర్లో దేశీయ ఎగుమతుల విలువ 23.62 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఈసారి మొత్తం ఎగుమతుల్లో ఇంజినీరింగ్ ఉత్పత్తుల వాటానే 28.19 శాతంగా ఉండటం గమనార్హం. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల విలువ 3.82 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇక దిగుమతులు 53.15 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది నవంబర్లో 33.81 బిలియన్ డాలర్లుగానే ఉండగా, 57.18 శాతం పెరిగాయి. బంగారం దిగుమతుల విలువ 4.22 బిలియన్ డాలర్లుగా ఉన్నది. దీంతో వాణిజ్య లోటు 23.27 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదిలావుంటే ఈ ఏప్రిల్-నవంబర్లో దేశీయ ఎగుమతులు 262.46 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే వ్యవధిలో 174.15 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి.