Exports | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: భారత్ ఎగుమతులు వరుసగా ఏడవ నెలలోనూ క్షీణబాటలోనే కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86 శాతం తగ్గుదలతో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాల్లో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంతో ఎగుమతులు క్షీణించాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఇదే నెలలో దిగుమతులు సైతం 5.23 శాతం తగ్గి 58.64 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దిగుమతులు తగ్గడం వరుసగా ఇది తొమ్మిదవ నెల.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలంలో ఎగుమతులు 11.9 శాతం తగ్గి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఐదు నెలల్లో దిగుమతులు 12 శాతం క్షీణించి 271.95 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు కేంద్ర వాణిజ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూలై నెలలో ఎగుమతులు 15.88 శాతం తగ్గాయని, ఆగస్టు నెలలో ఈ అంశమై మెరుగుదల కన్పిస్తున్నదని గణాంకాల్ని మీడియాతో పంచుకుంటూ కేంద్ర వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్తాల్ చెప్పారు.
జూలై వరకూ అంతర్జాతీయ స్థితి నిరాశాపూరితంగా ఉన్నదని, ప్రస్తుతం ఆశావహంగా కన్పిస్తున్నదన్నారు. ఆందోళన కల్గిస్తున్న వాణిజ్యలోటు డేటా ఆగస్టులో బాగున్నదని తెలిపారు. అయితే యూరప్లో వడ్డీ రేట్ల పెరుగుదల ఆందోళన కల్గించే అంశమని చెప్పారు. దీంతో అక్కడి తయారీ పరిశ్రమ మందగించి, భారత్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
ఆగస్టు నెలలో తేయాకు, కాఫీ, బియ్యం, మసాలా దినుసులు, తోలు ఉత్పత్తులు, ఆభరణాలు, జౌళి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. అయితే 30 కీలక రంగాల్లోని ఇనుప ఖనిజం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల, నూనె గింజలు, జీడిపప్పు, తివాచీలు, ఇంజనీరింగ్, ఫార్మా, సముద్ర ఉత్పత్తులు తదితర 15 విభాగాలు సానుకూల వృద్ధి సాధించాయి. దిగుమతులకు సంబంధించి క్రూడాయిల్ దిగుమతుల విలువ 23.76 శాతం తగ్గి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం దిగుమతులు ఏకంగా 38.75 శాతం పెరిగి 4.93 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలంలో పుత్తడి దిగుమతులు 10.48 శాతం వృద్ధితో 18.13 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.
ఈ ఏడాది ఆగస్టు నెలలో సర్వీసుల ఎగుమతులు నిరుడు ఇదేనెలలో పోలిస్తే దాదాపు ఫ్లాట్గా 26.39 బిలియన్ డాలర్ల వద్ద నమోదయ్యాయి. సర్వీసుల దిగుమతులు 15.22 బిలియన్ డాలర్ల నుంచి 13.86 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఏప్రిల్-ఆగస్టు మధ్య నెలల్లో సర్వీసుల ఎగుమతులు 126.85 బిలియన్ డాలర్ల నుంచి రూ.133.38 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు 26.29 శాతం వృద్ధితో 2.17 బిలియన్ డాలర్లకు చేరాయి.
ఆగస్టు నెలలో వాణిజ్యలోటు (దిగుమతులు, ఎగుమతుల విలువ మధ్య వ్యత్యాసం) గత ఏడాది ఇదే నెలలో పోలిస్తే దాదాపు ఫ్లాట్గా 24.16 బిలియన్ డాలర్ల వద్ద నమోదయ్యింది. అయితే 2023 జూలైలో నమోదైన 20.67 బిలియన్ డాలర్లకంటే అధికం. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్యకాలంలో వాణిజ్యలోటు 2022 సంవత్సరంలో ఇదేకాలంతో పోలిస్తే 112.85 బిలియన్ డాలర్ల నుంచి 98.88 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో క్రూడ్ ధర భారీగా తగ్గడమే వాణిజ్యలోటు మెరుగుదలకు ప్రధాన కారణం.