న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశ ఆర్థిక వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) 6.8 శాతంగా నమోదు కావచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ తాజాగా అంచనా వేసింది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) 7 శాతానికి పెరిగే వీలుందన్నది. అలాగే మౌలికాభివృద్ధిపై, వ్యాపార నిర్వహణ సులభతరంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కొనసాగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. టీవీఎస్ సైప్లె చైన్ సొల్యూషన్స్ చైర్మన్, సీఐఐ అధ్యక్షుడు ఆర్ దినేశ్ పీటీఐకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈసారి దేశ జీడీపీ 6.8 శాతంగా ఉండొచ్చన్నారు. ఇంతకుముందు 6.5-6.7 శాతంగానే అంచనా వేశామన్న ఆయన.. పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తుండటంతో తమ అంచనాను పెంచినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధానికి (ఏప్రిల్-సెప్టెంబర్)గాను దేశ వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.