న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: కీలక రంగాలు మసకబారుతున్నాయి. గత కొన్ని నెలలుగా జెట్స్పీడ్ వేగంతో దూసుకుపోయిన కీలక రంగాలు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి తాకుతూ.. జూలై నెలకుగాను 4.5 శాతానికి పడిపోయింది. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 9.9 శాతంతో పోలిస్తే సగానికి సగం పడిపోయింది. వరుస నెలల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాలు జూలైలో మాత్రం సింగిల్ డిజిట్కు పరిమితమైంది. ముఖ్యంగా జూన్లో 13.2 శాతం, మే 19.3 శాతం, ఏప్రిల్లో మాత్రం 9.5 శాతం, మార్చిలో 4.8 శాతం, ఫిబ్రవరిలో 5.9 శాతం, జనవరిలో 4 శాతంగా ఉన్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలానికిగాను 11.5 శాతంగా ఉన్నది. క్రూడాయిల్ ఉత్పత్తి 3.8 శాతానికి పడిపోగా, అలాగే సహజ వాయువు ప్రొడక్షన్ 0.3 శాతానికి పడిపోవడంతోపాటు బొగ్గు ఉత్పత్తి 11.4 శాతానికి, రిఫైనరీ ఉత్పత్తులు 6.2 శాతంగాను, స్టీల్ 5.7 శాతం, సిమెంట్ 2.1 శాతం, విద్యుత్ 2.2 శాతానికి పడిపోవడంతో మొత్తం కీలక రంగాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపింది. కానీ, ఎరువుల ఉత్పత్తి 6.2 శాతం పెరగడం విశేషం.