న్యూఢిల్లీ, జూన్ 21: కొద్దిరోజులుగా ఆమడదూరం నుంచి చేజారిపోతున్న ఆల్టైమ్ గరిష్ఠస్థాయిని భారత్ బెంచ్మార్క్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ ఎట్టకేలకు చేధించింది. బుధవారం 63,888.31 పాయింట్ల వద్దకు చేరడం ద్వారా సెన్సెక్స్ ఈ ఫీట్ సాధించింది. 2022 డిసెంబర్ 1న నెలకొల్పిన 63,583.07 పాయింట్ల గరిష్ఠ స్థాయిని అధిగమించి ఏడు నెలల తర్వాత కొత్త రికార్డును సృష్టించింది. చివరకు 195.45 పాయింట్లు లాభపడి 63,523.15 పాయింట్ల వద్ద ముగిసింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ మాత్రం డిసెంబర్నాటి 18.887.5 పాయింట్ల రికార్డుస్థాయిని అందుకోవాల్సి ఉంది. బుధవారం ఈ సూచి 18,875.7 గరిష్ఠంవరకూ పెరగ్గా, సోమవారం 18,881.45 స్థాయిని తాకింది. అయితే తాజాగా ఇది 40.15 పాయింట్లు పుంజుకుని 18,856.85 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం ఇదే ప్రథమం.
తాజా మార్కెట్ ర్యాలీకి హెచ్డీఎఫ్సీ ద్వయం నేతృత్వం వహించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో హెచ్డీఎఫ్సీ విలీనమయ్యే సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ రెండు షేర్లూ 1.7 శాతం మేర పెరిగాయి. ఇతర సెన్సెక్స్ షేర్లలో పవర్గ్రిడ్ 3.68 శాతం పెరగ్గా, టెక్ మహింద్రా, టీసీఎస్, విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీలు పెరిగాయి. మరోవైపు ఎం అండ్ ఎం, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతిలు 1.6 శాతం వరకూ నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే అన్నింటికంటే అధికంగా యుటిలిటీస్ ఇండెక్స్ 1.19 శాతం పెరిగింది. సర్వీసెస్ ఇండెక్స్ 1.18 శాతం, పవర్ సూచి 1.08 శాతం, టెలికమ్యునికేషన్స్ 0.81 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.60 శాతం చొప్పున పెరిగాయి. ఆటోమొబైల్, మెటల్, రియల్టీ సూచీలు మాత్రం నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచి 0.68 శాతం, స్మాల్క్యాప్ సూచి 0.24 శాతం చొప్పున పెరిగాయి.
గ్లోబల్ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీలో భాగంగానే సెన్సెక్స్ ఆల్టైమ్ రికార్డుస్థాయికి చేరిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ విజయ్కుమార్ చెప్పారు. పలు దేశాల సూచీలు ఇప్పటికే ఏడాది గరిష్ఠం వద్ద ఉన్నాయని తెలిపారు. అమెరికా నాస్డాక్ ఇండెక్స్ ఆల్టైమ్ రికార్డుస్థాయికి చేరగా, కొరియా కొస్పి, జపాన్ నికాయ్ సూచీలు కొత్త రికార్డుల్ని సృష్టించాయి. రుతుపవనాల విస్తరణ సరిగ్గాలేకపోవడం బుల్స్ను ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్నదని, జూన్ 15 వరకూ దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సగానికంటే తక్కువగా ఉన్నదని విజయ్కుమార్ వివరించారు. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి భారత్ మార్కెట్లో పెట్టుబడులు చేస్తున్నందున సెంటిమెంట్ మెరుగుపడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రంగనాథన్ తెలిపారు.
గత ఏడు నెలల్లో మార్కెట్ భారీ హెచ్చుతగ్గులకు లోనై ప్రస్తుతం దాదాపు అదేస్థాయిలో ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ల సంపద మాత్రం రూ.4 లక్షల కోట్లు పెరిగింది. 2022 డిసెంబర్ 1న బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.289.9 లక్షల కోట్లుకాగా, తాజాగా రూ.294 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్ 4 శాతం పెరగ్గా, బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 12 శాతం ర్యాలీ జరిపాయి.